ఏపీలో ఆటో డ్రైవర్లపై ఉచిత బస్సు దెబ్బ.. ! పరిహారం కోసం కొత్త పథకం ?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం స్త్రీశక్తి ప్రారంభమవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా మహిళకు ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ పథకం అమలు వల్ల ఆటోడ్రైవర్లపై మాత్రం భారీ దెబ్బ పడబోతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అంతకంతకూ పెరిగిపోతున్న వ్యక్తిగత వాహనాల కారణంగా ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల్ని ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని తీసుకొస్తుండటంతో ఇక ఆటో డ్రైవర్లకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. దీంతో వారంతా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దీని వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఆటో డ్రైవర్లకు మెరుగైన పరిహారం అందించేందుకు వీలుగా కొత్త పథకానికి రూపకల్పన చేసేలా వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలిపి ఆటో డ్రైవర్లకు పరిహారం అందించే పథకానికి రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.

అయితే ఇవాళ ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నా ఇప్పటివరకూ ఆటో డ్రైవర్లకు అందించే సాయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్న తమపై ఉచిత బస్సు పథకం పిడుగుపాటు కాబోతోందనే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి తమను కూడా ఆదుకోవాలని వివిధ నగరాలు, పట్టణాల్లో ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మహిళకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటన కోసం ఆటోడ్రైవర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రకటన రాకపోతే మాత్రం వారిలో ఆందోళన మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications