విద్యుత్ కోతలపై విపక్షాలది దుష్ప్రచారం-బొగ్గు సమస్య వల్లేనన్న విద్యుత్ మంత్రి బాలినేని
ఏపీలో విద్యుత్ కోతలకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పందించింది. విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రూమర్లపై స్పందించారు. విపక్షాలు ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కోతలకు అసలు కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో బొగ్గు కొరత వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని, అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని బాలినేని భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.
విద్యుత్ కోతలపై రాష్ట్రంలో విపక్షాలు బురదజల్లుతున్నాయని మంత్రి బాలినేని తెలిపారు. ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకుని టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన ఆరోపించారు. రూ.కోట్లు తీసుకుని ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారని గత టీడీపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. తక్కువ ధరకు విద్యుత్ కొందామంటే కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని : మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని విధాలా బ్రష్టు పట్టించాడని ఆయన ధ్వజమెత్తారు. సోలార్ పవర్ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని విమర్శించారు.
ఏపీలో తాజాగా బొగ్గు సంక్షోభం నేపథ్యంలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వం.. త్వరలో అధికారిక విద్యుత్ కోతలు విధించాల్సి రావొచ్చని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విద్యుత్ కోతలపై పుకార్లు మొదలయ్యాయి. వీటిపై ఇవాళ స్పందించిన ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వస్తున్న పుకార్లను ఖండిస్తూ ఇంధన శాఖతో పాటు ఈపీడీసీఎల్ అధికారులు కూడా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో ప్రజల్లో అనుమానాల్ని తొలగించే ప్రయత్నం చేశారు.