మోడీయే క్షమాపణ చెప్పాలి, అలిపిరికి అదే కారణం: గంటా
అమరావతి: అలిపిరిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై జరిగిన దాడికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని బీజెపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన డిమాండ్ ను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు
శనివారం నాడు అమరావతిలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నిరసన తెలిపే పద్దతి ఇది కాదంటూ పార్టీ కార్యకర్తలపై బాబు సీరియస్ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఓ పథకం ప్రకారంగానే ఈ దాడి జరిగిందని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆవేదన అలిపిరి ఘటన వ్యక్తీకరిస్తోందని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రానికి అన్ని చేస్తామని ఇచ్చిన హమీలను అమలు చేయకుండా మోడీ మోసం చేశారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హమీలను మోడీ అమలు చేయనందుకు గాను ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.