విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలొస్తాయ్-కేసీఆర్ కు ఏపీ మంత్రి కౌంటర్
తెలంగాణ అభివృద్ధితో ఏపీని పోలుస్తూ అక్కడి సీఎం కేసీఆర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, అందుకే భూముల ధరలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ఏపీలో అధికార పార్టీ నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో ఇవాళ కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీలో భూముల ధరలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. అయితే విశాఖపట్నంలో కూడా ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాజధాని హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. తద్వారా హైదరాబాద్ తో పోల్చుకోవాలంటే వైజాగ్ ఉందని గుర్తుచేశారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ పైనా మంత్రి అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారని, కానీ సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.
అలాగే వారాహి విజయయాత్రలో స్క్రిప్ట్ చంద్రబాబుది అయితే, స్పీచ్ పవన్ కల్యాణ్దన్నారు. ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రి కాలేరని స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొందాలన్నారు. తాను ఓడిపోతానని పవన్ కళ్యాణ్కు ఇప్పటికే క్లారిటీ వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు వల్లే పవన్ కు ప్రాణహాని ఉందన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను చంపేద్దాం అనుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. చంద్రబాబు బిస్కెట్ల కోసం పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications