వైజాగ్ ర్యాలీకి ప్రేరణ అమరావతి పాదయాత్రే-మంత్రి అమర్నాథ్-సహకరించాలని జనానికి పిలుపు
అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో రేపు విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేస్తోంది. ఈ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించబోతున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇవాళ ప్రకటించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సాధిస్తామన్నారు. తమ పోరాటం శాంతియుతంగా ఉంటుందని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పేందుకే విశాఖలో గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు సహకరించాలన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా, ఉత్తరాంధ్ర ఇప్పటికీ చాలా వెనకబడి ఉందని, ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం తమకు వచ్చిందన్నారు.దాన్ని వదులుకోబోమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్ తరాల్లో కూడా మార్పు రాదన్నారు. రేపు మొదలవుతున్న పోరాటం కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు. మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమన్నారు. కేంద్రీకరణ వల్ల ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు చాలా అన్యాయం జరిగిందని, అది పునరావృతం కాకూడదని మంత్రి తెలిపారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేస్తున్న పాదయాత్రలో, రైతుల వైఖరి తమకు ప్రేరణగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వారిపై పోరాటం చేయడానికి అది ప్రేరేపించిందన్నారు.

విశాఖ గర్జనకు వేలాదిగా తరలి వస్తున్న జనం, అహింసా మార్గంలో వారి ఆకాంక్షలను పాదయాత్ర చేస్తున్న రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని మంత్రి అమర్ నాథ్ కోరారు. విశాఖ నగరం ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చిందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇక్కడ పుట్టి పెరిగిన వారంతా ఇప్పుడు రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాయలసీమ నాయకులు కూడా విశాఖ ఉద్యమానికి మద్దతు తెలియజేయడం గర్జనకు మరింత ఊపునిచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications