మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఏపీ మంత్రి??
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల్లో ఒక మంత్రి పదవి ఊడిపోనుందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూ కావాలంటూ యూట్యూబ్ ఛానెల్కు చెందిన ఒక మహిళా జర్నలిస్టు మెసేజ్ పెట్టగా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ తెలుగుదేశం పార్టీ నేత అయ్యపాత్రుడు ట్వీట్ చేశారు.
ఒక మహిళా జర్నలిస్టును సదరు మంత్రి లైంగికంగా వేధించారని, ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన అన్నివివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయన్నారు. ఇదేమీ రహస్యమైన విషయం కాదని, బహిరంగ రహస్యమని, ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆధారాలు కూడా చేరాల్సినవారికి చేరాయని, మంత్రిని బర్తరఫ్ చేయడం ఖాయమంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
గతంలో కూడా ఆ మంత్రిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అవి తనవి కావంటూ ఆయన వాటిని ఖండించారు. మార్ఫింగ్ చేసి వాటిన విడుదల చేశారని, నేరస్తులను పట్టుకొని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన మంత్రిగా లేరు.
ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు ఎక్కువవడంతోపాటు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, రేపల్లె బస్టాండ్ సంఘటనలు మరువకముందే ఏకంగా ఒక మంత్రిపై ఆరోపణలు రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. దీంట్లోని నిజనిజాలను వెలికితీయాలని కోరుతున్నారు. సదరు మంత్రిని పదవినుంచి దింపేవరకు పోరాటం చేస్తామని తెలుగుదేశం, జనసేన వర్గాలు ప్రకటించాయి. పోరాటానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి.