వల్లభనేని వంశీ అరెస్టు అందుకే- లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం దళితుడైన గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసి ఫిర్యాదు మార్పించిన వ్యవహారంలో అరెస్టు అయిన వల్లభనేని వంశీ మోహన్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో వంశీ అరెస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వంశీ ఎందుకు జైలుకు వెళ్లారో చెప్పేసిన లోకేష్.. తర్వాత ఏం జరగబోతోందో కూడా వెల్లడించారు.
దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకెళ్లారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామని లోకేష్ వెల్లడించారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారని,ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. అక్రమాలను నిలదీస్తే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఈ కేసులోనే ఇప్పుడు వంశీ అరెస్టు అయ్యారన్నారు.

మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తన తల్లి భువనేశ్వరిని దూషించిన వ్యవహారంలో వంశీపై చర్యలు తప్పవంటూ లోకేష్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వంశీని అరెస్టు చేయించారు. దీంతో ఇప్పుడు వంశీ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు వంశీ సతీమణి పంకజశ్రీ కూడా ఇవాళ జైల్లో ఆయన్ను ములాఖత్ లో కలిసి వచ్చి ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే లోకేష్ మాత్రం చట్టపరంగానే ఆయన్ను శిక్షిస్తామని ఇవాళ క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications