Amaravati Row: సజ్జలకు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్..!
అమరావతి రాజధానిపై మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలతో మొదలైన రాజకీయం ఇవాళ మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఓవైపు రాజధానిలో జరుగుతున్న డబ్బుల వృథాతో పాటు మరోవైపు రైతుల చావులపై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇవాళ వైసీపీ నేత సజ్జల వివరణ ఇచ్చారు. దీనికి మళ్లీ మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి రాజధానిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వరుసగా విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యల్లో కొత్తగా చెప్పింది ఏమీ లేదని, అమరావతిపై తమ స్టాండ్ మారలేదని చెప్పుకొచ్చారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలని కోరారు. అమరావతి రాజధాని అని తమకు పూర్తి క్లారిటీ ఉందని, తమలాగే వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

అమరావతిలో కృష్ణానది రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియకుండా మాట్లాడారంటూ సజ్జలపై నారాయణ ఆరోపణలు చేశారు. రైతులతో మాట్లాడటానికి ఇష్టపడని నాయకులు ఇప్పుడు లేనిపోని ప్రేమ చూపిస్తారంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నిర్వాకంతోనేనే అమరావతి పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. అమరావతి నిర్మాణ పనులకు పారదర్శకంగా టెండర్లు పిలిచామని, రాజధానిపై బురద జల్లే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ సచివాలయం, పార్లమెంట్ కంటే విస్తీర్ణంలో ఏపీ సచివాలయం నిర్మాణంపైనా సజ్జల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ లో కేవలం మంత్రులు, వారి శాఖలు,అధికారులు మాత్రమే ఉండేలా నిర్మించారని,
అమరావతిలో నిర్మించే సెక్రటేరియట్ లో మంత్రులు,సిబ్బంది,HOD లు,ఇతర కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గరగా ఉండేవిధంగా అన్ని నిర్మాణాలు చేస్తున్నమని వెల్లడించారు.












Click it and Unblock the Notifications