సంస్కారం ఉంటే అలా మాట్లాడరు: జగన్పై సునీత
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ జగన్ రైతు భరోసా యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడంపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగంపేట గ్రామంలో టిడిపి నాయకులు రామ్మూర్తినాయుడు ఇంట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును విమర్శించేందుకే జగన్ రైతు భరోసా యాత్రను చేపట్టారని ఎద్దేవా చేశారు.
జగన్కు సంస్కారం, ఆలోచన వుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి ఇలా మాట్లాడరని పరిటాల సునీత అన్నారు. 10సంవత్సరాలుగా దోచుకుని దాచుకున్న దానిలో ఒకశాతం ఇస్తే రైతుల సంక్షేమంతో పాటు రుణమాఫీ చేయవచ్చన్నారు. ఆలోచించి మాట్లాడడం నేర్చుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.
జగన్ ఎన్ని చెప్పినా ప్రజలు చంద్రబాబునే నమ్ముతున్నారని, రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. రైతుల పట్ల అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్గా మార్చారని వారు విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే దేశంలో ఎవరూ చేయని రీతిలో రుణమాఫీ చేశారన్నారు.
రైతులకు రూ.1524కోట్లు రుణాలు మంజూరు చేశామని, ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2013కు సంబందించి ఇన్సూరెన్స్ సొమ్ము రూ.227కోట్లకు గాను రూ.188కోట్లు జమ చేశామని, గత ప్రభుత్వం ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీని 2013కు సంబంధించి రూ.675కోట్లు, 2014కు సంబంధించి రూ.573కోట్లు మంజూరు చేయించామన్నారు. అనంతపురంను కరువు రహిత ప్రాంతంగా మార్చాలన్నదే చంద్రబాబు లక్ష్యమని పరిటాల సునీత చెప్పారు.