ఏపీలో కరోనా: ఆ డాక్టర్కు ఎంత బలుపు?.. రక్తికట్టిన డ్రామా.. నర్సీపట్నం వీడియోపై మంత్రి నాని ఫైర్
కరోనా మహమ్మారి జడలువిప్పుతున్న తరుణంలో.. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో మాత్రం రాజకీయాలు వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. కొవిడ్-19 పేషెంట్లను ట్రీట్ చేస్తోన్న డాక్టర్లకు జగన్ ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా ఇవ్వడంలేదంటూ ఓ డాక్టర్ సంచలన ఆరోపణలు చేయడం దుమారానికి దారితీసింది. సదరు వీడియో వైరల్ కావడంతో, జాతీయ మీడియాలోనూ ఈ ఘటనపై వార్తలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలు చేసిన డాక్టర్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇదంతా హైదరాబాద్ లో దాక్కుని చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే..
ఏపీలో మంగళవారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 304కు పెరిగింది. అందులో విశాఖపట్నం జిల్లాకు చెందినవాళ్లు 20 మంది ఉన్నారు. జిల్లాలో వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ అదే జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్(అనస్తీషియనిస్ట్)గా పనిచేస్తోన్న సుధాకర్ రావు మాత్రం.. వాస్తవాలు వేరుగా ఉన్నాయంటూ ఓ వీడియో చేశారు. సదరు వీడియోను నిమిషాల వ్యవధిలోనే టీడీపీ వర్గాలు షేర్ చేయడంతో వైరలైంది. దీంతో ఘటనలపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.

సంచలన ఆరోపణలు..
తెలంగాణలో వైద్యులు, సిబ్బందికి అన్ని రకాల రక్షణ చర్యలు అందిస్తున్నారని, ఏపీలో మాత్రం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న డాక్టర్లకు కూడా కనీసం మాస్కులు లేవని, ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమని చెబుతున్నారని, నర్సీపట్నం ఆస్పత్రి పేరుకే 150 పడకలైనా కనీస సౌకర్యాలు లేవని డాక్టర్ సుధాకర్ రావు ఆరోపించారు. ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడంలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నర్సీపట్నం మొత్తం కరోనా పేషెంట్లుగా తేలినా ఆశ్చర్యపోనక్కర్లేదని, కరోనా విజృంభిస్తున్నవేళ నర్సీపట్నం ఆస్పత్రి దుస్థితిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానంటూ ఆయన అరుపులు కేకలు వేయడం వీడియోలో రికార్డయింది. కాగా, డాక్టర్ సుధాకర్ రావు.. టీడీపీ డాక్టర్స్ విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, వీడియో చెయ్యడానికి ముందు ఆయన.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిసొచ్చారని వెల్లడికావడంతో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. దీనిపై మంత్రి స్పందించారు..

మంత్రి ఘాటు స్పందన..
‘‘కొంతమందిచేత ప్రేరేపించబడిన డాక్టర్ ఒకాయన.. వీడియో చేశాడు. ఆ నాటకాన్ని టీడీపీ వెబ్ సైట్లు రక్తికట్టించాయి. వీడి దగ్గర మాస్కులు లేవు.. వాడి దగ్గరైతే అన్నీ ఉన్నాయి అని ఏవేవో కూశాడు. ఆ డాక్టర్ గాడికి అంత బలుపేంటి? ఎంతలా మోటివేట్ చేస్తే.. ముఖ్యమంత్రుల్ని వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు? నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టరా? రాజకీయ నాయకుడా ? అతను నిలబడి వీడియో చేసిన అదే ఆస్పత్రిలో డాక్టర్ల కోసం 20 పీపీఈలు ఉన్నాయి. నిజానికి అది కరోనా ఆస్పత్రి కూడా కాదు''అని మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు.
Recommended Video

బాబు కుట్రలో భాగమే..
టీడీపీ నేతల మోటివేషన్ తోనే నర్సీపట్నం డాక్టర్ పిచ్చివాగుడు వాగాడన్న మంత్రి నాని.. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో దాక్కొని, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయిస్తూ, ఏపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని తిట్టారు. తెలంగాణలో కంటే ఎక్కువగా ఏపీలోనే కరోనా శాంపిల్స్ సేకరించామని, రాష్ట్రంలో కరోనా బాధితుల కోసం 24 వేల బెడ్లు సిద్ధం చేశామని, అందుబాటులో ఉన్న ఏడు ల్యాబ్ ద్వారా రోజుకు 1,175 శాంపిల్స్ పరీక్షలు జరుపుతున్నామని మంత్రి నాని వివరించారు.












Click it and Unblock the Notifications