హీరోలపై పేర్ని సెటైర్లు- డిస్టిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లతో చర్చ-టికెట్ల ధరలపై కమిటీదే నిర్ణయం
ఏపీలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరలపై ఇవాళ సినిమా థియేటర్ల యాజమాన్యాలు, డిస్టిబ్యూటర్లతో మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరలపెంపు, థియేటర్లపై దాడుల వ్యవహారంపై చర్చించారు. ప్రభుత్వం ఇప్పటికే కమిటీ నియమించిందని, అది ఇచ్చే నివేదిక ఆధారంగానే టికెట్ ధరలపై నిర్ణయం ఉంటుందన్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హీరోలు నాని, సిద్ధార్ధ్ లపైనా పేర్నినాని సెటైర్లు వేశారు.

డిస్టిబ్యూటర్లు, ధియేటర్ ఓనర్లతో పేర్ని భేటీ
ఏపీలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల తనిఖీలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇవాళ డిస్టిబ్యూటర్లు, ధియేటర్ ఓనర్లతో మంత్రి పేర్నినాని సచివాలయంలో భేటీ అయ్యారు. ఇందులో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా థియేటర్లు, డిస్టిబ్యూటర్ల ఇబ్బందుల్ని ప్రతినిధులు మంత్రి పేర్నినాని దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదులను సావధానంగా విన్న మంత్రి పేర్నినాని అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను మీడియాకు వెల్లడించారు.

కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ ధరల నిర్ణయం
ఏపీలో వివాదస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఇప్పటికే 13 మంది సభ్యులతో కమిటీ నియమించిందని, ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకే తాము కమిటీని నియమించి అధ్యయనం చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగని కమిటీ పేరుతో టికెట్ ధరల పెంపుపై కాలయాపన చేయబోమని పేర్నినాని పేర్కొన్నారు.

లైసెన్స్ లేని 130 థియేటర్లపైనే చర్యలు
ఏపీలో ఇప్పటివరకూ అధికారులు జరిపిన తనిఖీల్లో లైసెన్స్ లేని 130 థియేటర్లపైనే జరిమానాలు, జప్తుతో పాటు పలు చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు. మిగతా థియేటర్లు లైసెన్స్ లు లేకపోవడంతో ఈ తనిఖీలు జరకకముందే మూసేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ప్రభుత్వం మూడు నెలల ముందే లైసెన్స్ లను రెన్యువల్ చేసుకోవాలని కోరిందని, కానీ ఇప్పటివరకూ ఆ పని చేయని వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు.

హీరోలు నాని, సిద్ధార్ద్ లపై సెటైర్లు
ఏపీలో సినిమా టికెట్ల ధరల నియంత్రను తప్పుబడుతూ హీరోలు నాని, సిద్ధార్ధ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి పేర్నినాని స్పందించారు. హీరో నాని ఏ ఊర్లో ఉంటున్నారో, ఆయన ఏ ఊర్లో సినిమా థియేటర్, కిరణా కొట్లను పోల్చి చెప్పారో తెలియంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే ప్రభుత్వంపై ట్వీట్లు పెట్టిన మరో హీరో సిద్ధార్ధ్ గురించి మాట్లాడుతూ తమిళనాడులో ఉండే ఆయనకు ఏపీ గురించి ఎందుకన్నారు. ఆయన ఎప్పుడైనా ఏపీకి వచ్చారా, సచివాలయానికి వచ్చారా అని ప్రశ్నించారు. అంటే హీరో సిద్ధార్ధ్ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేశారని భావించాల్సి వస్తుందని పేర్నినాని సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications