ఏపీ ప్రభుత్వం తరఫున సిరివెన్నెల భౌతిక కాయానికి పేర్ని నాని నివాళి
హైదరాబాద్: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి ప్రముఖులు పోటెత్తుతున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాజకీయ నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వద్దకు అభిమానులు బారులు తీరుతున్నారు.
న్యుమోనియాతో బాధపడుతూ కిందటి నెల 24వ తేదీన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపిరితిత్తుల కేన్సర్ సోకింది. ఆరు సంవత్సరాల కిందటే కేన్సర్ సోకిన ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఆ తరువాత బైపాస్ సర్జరీ చేశారు. రెండో ఊపిరితిత్తికి కూడా కేన్సర్ సోకింది. ఆ భాగాన్ని తొలగించారు డాక్టర్లు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో సీతారామ శాస్త్రిని ఎక్మోపై ఉంచి చికిత్స అందించారు.
అప్పటికే ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కావడం, కిడ్నీ పనితీరు కూడా దెబ్బతినడం, కేన్సర్ కారణంగా రెండు ఊపిరితిత్తులు పాడైపోవడం వంటి కారణాలతో సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని ఈ ఉదయం ఫిల్మ్నగర్లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలకడానికి అభిమానులు తరలి వస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సిరివెన్నెలకు నివాళి అర్పిస్తున్నారు.
కొద్దిసేపటి కిందటే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ చేరుకున్నారు. సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. అక్కడే ఉన్న సీతారామ శాస్త్రి సమీప బంధువు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను పరామర్శించారు. ఆయనకు సానుభూతిని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ రాజమౌళి, గుణశేఖర్, ఎస్వీ కృష్ణారెడ్డి, ఎంఎం కీరవాణి, తనికెళ్ల భరణి, రావు రమేష్, అల్లు అరవింద్, మణి శర్మ నివాళి అర్పించారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. ఈ ఉదయం సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ను పరామర్శించారు. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతికకాయానికి నిర్వహించే అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం ఏపీకి చేరుకుంటారు.