కేసీఆర్ సూపర్: రేవంత్రెడ్డికి ఏపీ మంత్రి షాక్, 'దూసుకెళ్తున్న తెలంగాణ'
ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పితాని సత్యనారాయణ తెలంగాణకు చెందిన సొంత పార్టీ నేతలకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పితాని సత్యనారాయణ తెలంగాణకు చెందిన సొంత పార్టీ నేతలకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు.
పితాని గురువారం విలేకరులతో మాట్లాడారు. తమకు పదేళ్ల పాటు హైదరాబాదులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ముందుగానే వెళ్లిపోయామని చెప్పారు.
కేసీఆర్కు పితాని ప్రశంస
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతోందని పితాని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ఏపీలో చంద్రన్న బీమాను అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ టిడిపి నేతలకు షాక్
కాగా, ఏపీ మంత్రి, సొంత పార్టీ నేత పితాని సత్యనారాయణ తెలంగాణ సీఎం కేసీఆర్ను మెచ్చుకోవడం తెలంగాణ టిడిపి నేతలకు చెంప పెట్టు అనవచ్చు.
తెలంగాణ టిడిపి నేతల విమర్శలు
కేసీఆర్ పాలనలో ఎవరికీ న్యాయం జరగడం లేదని, కనీసం తెలంగాణ కోసం ఉద్యమించి ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయడం లేదని, కేసీఆర్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి నేతలు విమర్శిస్తున్నారు. కానీ పితాని మాత్రం మెచ్చుకోవడం గమనార్హం.
తెలంగాణ దూసుకెళ్తోంది
జాతీయ వృద్ధిరేటు కంటే తెలంగాణ ఐటీ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వేరుగా తెలిపారు. నేడు తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన టీ-వ్యాలెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో త్వరలో ఐటీకంపెనీలు ప్రారంభం కానున్నాయన్నారు. టి-బ్రిడ్జి కార్యక్రమం ద్వారా పలు అమెరికా స్టార్టప్లను భారత్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రథమ స్థానంలో తెలంగాణ
రావిరాల సమీపంలో మూడు వేలకు పైగా ఎకరాల్లో ఈ-సిటీ నిర్మాణం చేస్తున్నామని కేటీఆర్ ఈ- లావాదేవీల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం టీ వ్యాలెట్ ద్వారా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లింపులు చేయవచ్చన్నారు. ఆపిల్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో రానుందని చెప్పారు.
ఎలక్ట్రానిక్ హబ్గా..
ప్రస్తుతం తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ కార్యాక్రమాన్ని అమలు చేసేందుకు 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణాను ఎలక్ట్రానిక్ హబ్గా రూపొందిస్తున్నామని వివరించారు. ఈ-గవర్నెన్స్ నుంచి ఎం-గవర్నెన్స్ స్థాయికి తీసుకువెళతామని అన్నారు. అన్ని శాఖలను మొబైల్స్కు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.