గడపగడపలో మంత్రి రోజాకు వింత అనుభవం-పెన్షన్ సరే పెళ్లి కూతుర్ని చూడమన్న వృద్ధుడు
ఏపీలో వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు షాకులు తగులుతూనే ఉన్నాయి. పలు చోట్ల పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదని ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గడప గడపకూ వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం వెళ్లాల్సిందేనని వారికి టార్గెట్ పెట్టేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన పర్యాటక శాఖ మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలో ఇవాళ ఆర్కే రోజా పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో మాట్లాడారు. ఫించన్ వస్తుందా? లేదా? అని అడిగారు. తనకు నెలనెలా ఫించన్ వస్తుందని తెలిపారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం ఆమెకు భారీ షాకిచ్చాడు.
మంత్రి రోజాను సదరు వృద్ధుడు ఓ వింత కోరిక కోరాడు. పెన్షన్ వస్తుంది కానీ తాను ఒంటరిగా ఉన్నందున తనకు పెళ్లికూతురుని చూడాలని కోరాడు. ఆయన విన్నపం విన్న రోజా నవ్వుతూ 'ఫించను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం' అంటూ సమాధానం ఇచ్చి అక్కడి నించి వెళ్పిపోయారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.దీన్ని చూసిన విపక్షాలు కూడా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంపై సెటైర్లు వేసుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం తమ పరిస్ధితి చూసి తామే జాలిపడుతున్నారు.
గడపగడపలో మంత్రి రోజాకు వింత అనుభవం-పెన్షన్ సరే పెళ్లి కూతుర్ని చూడమన్న వృద్ధుడు#roja pic.twitter.com/GQh5UXLejX
— oneindiatelugu (@oneindiatelugu) May 17, 2022