RK Roja : పాజిటివ్ ఎనర్జీ కోసం అక్కడికి వెళ్లిన రోజా ? తప్పదంటున్న ఏపీ మంత్రి
ఏపీలో గతంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నేతగా పనిచేసి ఆ తర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి అదే ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో మంత్రిగా కూడా ఎదిగిన నేత ఆర్కే రోజా. ఆమె ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. గతంలో జబర్దస్త్ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ పనిచేసిన రోజా.. మంత్రి అయ్యాక మాత్రం వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే తన వ్యాఖ్యలతో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే క్రమంలో వైజాగ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీ క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజా ఇవాళ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని కూడా రోజా దర్శించుకున్నారు. శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందినట్లు రోజా తెలిపారు. అంతటితో ఆగకుండా వైజాగ్ శారదా పీఠాన్ని తాను దర్శించుకోవడం వెనుక కారణాన్ని రోజా బయటపెట్టారు. దీంతో ఇప్పుడు రోజా వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
తాను దేవాలయాలకు ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ కోసం వెళుతుంటానని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం సినీ, రాజకీయ నాయకులపై అనేకమంది నెగెటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ నెగెటివ్ ఎనర్జీ పోవాలంటూ తరచూ భగవంతుడిని దర్శించుకోవాలని రోజా తెలిపారు. ఇందుకోసమే తాను శారదా పీఠానికి వచ్చినట్లు రోజా పేర్కొన్నారు.