బెయిల్ కోసం ఇన్ని డ్రామాలా ? ఇదే సాక్ష్యం- చంద్రబాబుపై ఏపీ మంత్రి ఫైర్ !
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కిల్ స్కాంలో రెగ్యులర్ బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇవాళ మండిపడ్డారు. ముఖ్యంగా హెల్త్ రిపోర్ట్ ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ కోసం డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు గుండె సమస్యలు ఉన్న వ్యక్తి కంటి ఆపరేషన్ ఎలా చేయించుకుంటారని ఓ డాక్టర్ గా తాను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబుకు స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ వెనుక మానవతా దృక్పథం మాత్రమే ఉందని ఏపీ మంత్రి అప్పలరాజు తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన లాయర్లు హెల్త్ రిపోర్ట్ సమర్పించి బెయిల్ పొడిగింపు కోరుతున్నారన్నారు. కానీ ఆయన తప్పు చేయలేదని ఎక్కడా చెప్పడం లేదన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను ఓ డాక్టర్ గా తాను పరిశీలించినట్లు అప్పలరాజు తెలిపారు. అందులో ఏఐజీ ఆస్పత్రి చంద్రబాబు గుండె సైజు పెరిగిందని రిపోర్టు ఇచ్చిందని, దీని ప్రకారం చూస్తే ఏ డాక్టర్ కూడా ఆయన కంటికి ఆపరేషన్ చేయరని అప్పలరాజు పేర్కొన్నారు.

చంద్రబాబుకు గుండె సమస్యలు ఉన్నప్పుడు సాధారణంగా ఏ డాక్టర్ కూడా కంటి ఆపరేషన్ చేయరని మంత్రి అప్పలరాజు తెలిపారు. కానీ కంటి ఆపరేషన్ తర్వాత చేయించుకున్న హెల్త్ టెస్టులు చూస్తుంటే ఆ రిపోర్ట్ లో ఉన్నవి వాస్తవాలా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇందులో ఏంజియో గ్రామ్ రిపోర్ట్ కూడా లేదని, అలాగే మందుల ప్రిస్కిప్షన్ కూడా రాయలేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే తమ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయన్నారు.
చంద్రబాబు బెయిల్ కోసమే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు జనం చనిపోతున్నారని ప్రచారం చేశారని, ఆయనకు బెయిల్ వచ్చాక భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేస్తున్న పరామర్శల్ని ఎందుకు ఆపేశారని అప్పలరాజు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications