అచ్చెన్న మాటలు నిజం చేసిన చంద్రబాబు-టీడీపీ స్ధానంలోకి బీజేపీ-మంత్రి అప్పలరాజు కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పాలిటిక్స్ మరోసారి రచ్చకెక్కాయి. నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి. వైసీపీ ప్రభుత్వంపై తన సహజశైలిలో విమర్శలు చేసిన చంద్రబాబు చివర్లో.. తనకు ఇవే చివరి ఎన్నికలన్నారు. టీడీపీని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానన్నారు. దీనిపై వైసీపీ మంత్రులు ఇవాళ కౌంటర్లు ఇస్తున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఇవాళ స్పందించారు. చంద్రబాబు జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం మాట్లాడారని అప్పలరాజు తెలిపారు. 2024 ఎన్నికలు టీడీపీని సమాధి కట్టే ఎన్నికలని,చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాడెక్కేశాను బ్రతికించండి అన్నట్టు మాట్లాడారని విమర్శించారు. మరలా తన భార్యను చంద్రబాబే రాజకీయాల్లోకి లాగారని, సానుభూతి డ్రామా కోసం ఇలా చేశారన్నారు.
చంద్రబాబుకు సిగ్గు.. ఎగ్గు ఉండవని మంత్రి అప్పలరాజు అన్నారు. ఎలాంటి నీచానికైనా దిగజారుతాడని నిరూపించుకున్నాడన్నారు. చంద్రబాబును ఆయన ఇంట్లో వాళ్లయినా వారిస్తారా అని తనకు డౌటు అన్నారు.లేని విషయాన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తారని వారించరా చంద్రబాబుని అని అప్పలరాజు ప్రశ్నించారు. చంద్రబాబు పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వ్యతిరేకమన్నది నిజమని మంత్రి తెలిపారు. రాయలసీమలో చంద్రబాబును తన్ని తరిమేస్తారన్నారు. ఉత్తరాఖండ్ లో హైకోర్టు మార్చుకో గలిగినపుడు ఏపీలో ఎందుకు కుదరదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే జగన్ రాజధాని వికేంద్రీకరణ అన్నారన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తులు సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు. వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష వాడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎం జగన్ ను మీరు ఏం పీకగలరు చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబువి అన్నీ ఆర్భాటాలు..చంద్రబాబు పుట్టుకే ఒక 420 అన్నారు.
సీఎం జగన్ ఏనాడూ నీలాగా ఏడుపు మాటలు మాట్లాడలేదన్నారు. సానుభూతి రాజకీయాలకు సీఎం జగన్ కు ఉన్న అవకాశం ఏ రాజకీయ నాయకుడికీ లేదన్నారు. అయినా సీఎం జగన్ ఒంటరిగానే నడిచాడు.. ఒంటరిగానే సీఎం అయ్యాడన్నారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే స్థాయి చంద్రబాబుకు లేదని మంత్రి తెలిపారు. చంద్రబాబు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ప్రతిపక్ష పాత్ర కోసం బీజెపీ ఎదురుచూస్తోందన్నారు. చంద్రబాబు పోతేనే బీజేపీకి ప్రతిపక్ష పాత్ర అన్నారు. ప్రజలకు ఏం చేశాడు కనుక చంద్రబాబుకు ఓటేయాలని అప్పలరాజు ప్రశ్నించారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెం నాయుడి మాటలు చంద్రబాబు నిజం చేశాడన్నారు.