తగ్గు!: కవితపై సుజాత నిప్పులు, జగన్ సాయం కేసీఆర్ కోరడమా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పీతల సుజాత శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహానాడును డ్రామానాడుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు.
తక్షణం కవిత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమాజమే దేవాలయం అని తమ పార్టీ వ్యవస్థాపకులు చెప్పారని, అధే తమ సిద్ధాంతమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సహకారం కోరడం తెరచాటు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
అమరావతిలో జగన్ తలపెట్టిన దీక్షను దొంగదీక్షగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ సహకారం కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఫోన్ చేశారు.
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా శారద
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, ఉత్తమ్, మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.