ఎమ్మెల్సీ పదవులకు రేపు బోస్, మోపిదేవి రాజీనామా - ఆ తర్వాత మంత్రి పదవులకూ..
ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రేపు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు. శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ కు వారు తమ రాజీనామాలు పంపనున్నారు. నిర్ణీత ఫార్మాట్ లో వారు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్ కు ఫ్యాక్స్ చేసే అవకాశముంది. కరోనా కారణంగా నేరుగా రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం లేనందున ఫ్యాక్స్ లో పంపనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం మంత్రి పదవులకు కూడా పిల్లి, మోపిదేవి తమ రాజీనామాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి వీరు తమ రాజీనామాలు జగన్ కు ఇచ్చే అవకాశముంది. ఆ తర్వాత సీఎం జగన్ వాటిని ఆమోదించాల్సిందిగా కోరుతూ గవర్నర్ హరిచందన్ కు పంపనున్నారు. శాసనమండలి రద్దు ప్రతిపాదనల నేపథ్యంలో తన కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మండలి రద్దు కానప్పటికీ అప్పటికే నిర్ణయం తీసుకున్నందున వీరిని రాజ్యసభకు పంపారు. వీరు ఖాళీ చేసిన స్ధానాల్లో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఇప్పటికే వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఇందులో ఓ స్ధానం కచ్చితంగా దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది.