ఆ మంత్రి అంటే హడల్: మూడేళ్లలోనే ముగ్గురు ఐఎఎస్లు బదిలీ?
తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కీలకం. విధాన నిర్ణయాల అమలులో సీఎం చంద్రబాబు ఆయన అభిప్రాయాలకు విలువనిస్తారని వినికిడి. దీని ఆసరాగా అధికార యంత్రాంగాన్ని సదరు అమాత్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రి అంటే అధికారుల్లో దడ. తాను చెప్పిందే వినాలనే తత్వం, పట్టుదల ఆ అమాత్యుల వారిది. నిబంధనలు కుదరవన్న వినిపించుకోరు. తనకు తోచినప్పుడే తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తీరు భరించలేక అధికారులు మొహం చాటేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిర్మాణంలో ఉన్న రాజధాని 'అమరావతి' విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. మూడేళ్లలోనే శాఖకు ముగ్గురు కార్యదర్శులు మారిపోయారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అవగతమవుతూనే ఉన్నది. ఇలా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న ఓ మంత్రిగారి వైఖరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఆయన వ్యవహార శైలి మాత్రం అధికార వర్గాలను అసంతృప్తికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను చెప్పిందే వేదమంటూ, తన మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదలతో ఆయన తీసుకునే చర్యలు, చేసే వ్యాఖ్యలతో అధికారులు నొచ్చుకుంటున్నారు. ప్రభుత్వానికీ ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. సాంకేతిక అంశాల్లో పట్టు లేకున్నా తన మాటే నెగ్గాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు.
ఉన్నతాధికారుల అభిప్రాయాలు బేఖాతర్
సంబంధిత ఉన్నతాధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర అధికారుల ముందు అవమానించేలా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజధాని వ్యవహారాల్లో చిన్న చిన్న అంశాలు సైతం తన కనుసన్నల్లోనే జరగాలని ఆ మంత్రి భావిస్తారు. 'నిబంధనలకు విరుద్ధం' అని చెప్పినా వినకుండా... తాను చెప్పినట్లే చేయాలని హుకుం జారీ చేస్తారు. ఆ మంత్రి విపరీతమైన జోక్యాన్ని, వైఖరిని భరించలేక ఇప్పటికి ముగ్గురు ఉన్నతాధికారులు ఆ శాఖను వదిలేశారు.
హడావుడిగా గందరగోళంగా డాక్యుమెంట్
రాజధాని నిర్మాణంలో తీవ్ర చర్చనీయాంశమైన స్విస్ చాలెంజ్పై విధివిధానాల రూపకల్పనలో అప్పటి సీఆర్డీయే ఉన్నతాధికారి అభిప్రాయాలు, సూచనలు పట్టించుకోకుండా ఆ మంత్రి టెండర్ డాక్యుమెంట్ తయారు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులోని లోపాలపై కొందరు కోర్టును ఆశ్రయించడం, స్టే విధింపుతో రాజధాని నిర్మాణ ప్రక్రియకు కొన్ని నెలలపాటు బ్రేక్ పడింది మరి. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ సముదాయానికి గత ఏడాది సంక్రాంతి సమయంలో సీఆర్డీయే టెండర్లు పిలిచింది. అమరావతిలో తొలి నిర్మాణం కావడంతో దానిపై అన్ని వర్గాల్లోనూ పెద్దఎత్తున ఆసక్తి నెలకొంది. దీంతో ప్రసార మాధ్యమాల ప్రతినిధుల ఒత్తిడి మేరకు అప్పటి సీఈ డీ కాశీవిశ్వేశ్వరరావు తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధిత వివరాలను బయటపెట్టారు. 'నేను చెప్పాల్సిన కీలక విషయాన్ని ఒక సీఈ చెప్పడమేమిటి?' అని మంత్రి ఆగ్రహించారు. తర్వాతీ కాలంలో ఎంతో అనుభవం ఉన్న సదరు సీఈ ప్రాధాన్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించారని వినికిడి.
మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మాకీ అసోసియేట్స్ తొలగింపులోనూ ప్రమేయం
పరిపాలనా నగరి మాస్టర్ప్లాన్ రూపకల్పనకు తొలుత ఎంపిక చేసిన మాకీ అసోసియేట్స్ (జపాన్) తొలగింపులోనూ ఆ మంత్రి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టోక్యోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు కంపెనీ ప్రతినిధులు తనను 'సముచిత రీతి'లో రిసీవ్ చేసుకోలేదన్న ఆగ్రహమే దీనికి కారణమని తెలుస్తోంది. మాకీ తొలగింపునకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయకున్నా, ఈ చర్యతో ఇబ్బంది వస్తుందని హెచ్చరించినా... ఆ మంత్రి గట్టిగా పట్టుబట్టి తాను అనుకున్నది సాధించినట్లు సమాచారం. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని అతి తక్కువ సమయంలో, మంచి ప్రమాణాలతో నిర్మించడం నిజమే. కానీ... వ్యయం పెరుగుతూ పోవడానికి ఆ మంత్రే కారణమనే ఆరోపణలున్నాయి. మంత్రి దెబ్బకు ఆయన సొంత జిల్లాకు కలెక్టర్గా వచ్చేందుకు ఐఏఎస్ అధికారులు జడుసుకుంటున్నారట! 'మా జిల్లాకు కలెక్టర్గా రండి' అని పలువురు ఐఏఎస్లను మంత్రి స్వయంగా కోరినా... 'సారీ'యే సమాధానంగా వస్తోంది.
నిద్రరాకపోతే తనిఖీలే!
'ఆ మంత్రికి నిద్ర రాకపోతే... అర్ధరాత్రి తనిఖీలంటూ హడావుడి చేస్తారు' అనే వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో అర్ధరాత్రి ఓ అధికారికి ఫోన్ చేసి 'పనులను తనిఖీ చేద్దాం రండి' అని పిలిచారు. 'పనులు బాగానే జరుగుతున్నాయి. పైగా... పగటిపూట పరిశీలిస్తేనే విషయం తెలుస్తుంది. జనంతోనూ మాట్లాడవచ్చు' అని ఆ అధికారి సూటిగా చెప్పారు. ఒక కలెక్టర్ కూడా మంత్రికి ఇదే తరహాలో సమాధానమిచ్చారు. ''సమస్యలు తెలుసుకోవాలంటే పగలు వెళ్లాలి. ఇప్పుడు పని చేసే సిబ్బందీ ఉండరు. సమస్యలు చెప్పేందుకు ప్రజలూ ఉండరు. అర్ధరాత్రి తనిఖీలేమిటి సార్'' అని స్పష్టం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications