రెండు ఎమ్మెల్సీలు టీడీపీవే: ప్రకాశంలో మాగుంట, కర్నూలులో శిల్పా గెలుపు
హైదరాబాద్: ఏపీలోని రెండు 'స్ధానిక' కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈనెల 3న నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రకాశం ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఒంగోలులోని మెప్మా భవనంలో ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్ధి అట్ల చినవెంకటరెడ్డిపై 711 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 992 ఓట్లు ఉండగా 755 ఓట్లు పోలయ్యాయి.

ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 724 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అట్ల చినవెంకటరెడ్డికి కేవలం 13 ఓట్లు మాత్రమే దక్కాయి. 17 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగించారు.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అవసరమైన మెజారిటీ లేకపోయినా పోటీకి దిగిన టీడీపీ పార్టీ వైఎస్ఆర్ సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఎంపీటీసీలతో ఇతర రాష్ట్రాల్లో క్యాంపు నిర్వహించడం, దీనిపై అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
మరోవైపు కర్నూలు ఎమ్మెల్సీ స్ధానానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పట్టణంలోని టౌన్ మోడల్స్కూల్లో ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నుంచి కూడా టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డికి 600 ఓట్లు రాగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెంకటేశ్వరరెడ్డికి 420 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో తోలి ప్రాధాన్యత ఓట్లలోనే 50 శాతానికి పైగా ఓట్ల మెజారిటీ రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అవసరం లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి విజయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. లెక్కింపు కేంద్రంలోకి మీడియాను లోపలికి పోలీసులు అనుమతించ లేదు.












Click it and Unblock the Notifications