ఇక బ్యాలెట్లు వద్దంటాడేమో: ఒకే ఇంట్లో వారిద్దరూ: చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు
అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ పుర పాలక సంఘాలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావించిన గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మూడు చోట్లా గట్టపోటీ ఇస్తుందనుకున్న టీడీపీ చతికిల పడుతోంది. చాలా వార్డుల్లో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీపై.. అధికార పార్టీ నాయకులు దండయాత్ర మొదలైంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఎప్పట్లాగే- చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలను సంధించారు. సెటైర్లు విసిరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వద్దని, బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేసిన చంద్రబాబు.. తన వైఖరిని మార్చుకుంటారేమోనని సాయిరెడ్డి అన్నారు.
అప్పట్లో ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు కావాలంటూ చంద్రబాబు పోరాడారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఎదురవుతోంటే.. ఇక బ్యాలెట్లు వద్దు ఈవీఎంలు కావాలంటాడేమోనని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తన ఓటమిని ఓట్ల ప్రక్రియ మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. పప్పూ (నారా లోకేష్) అండ్ తుప్పూ (చంద్రబాబు) ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉన్నారట.. అంటూ సాయిరెడ్డి చురకలు అంటించారు. ఎన్నికల ఫలితాల రోజు కూడా తండ్రికొడుకులిద్దరూ ఇంట్లోంచి కదలలేదంటే, ప్రజాస్వామ్యం మీద వారికి ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పదంటూ సెటైర్లు వేశారు.