చంద్రబాబుకు రాజధాని సెగ -విశాఖలో చేదు అనుభవం -జగన్ దెబ్బకు నగరాలు పతనం
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి పాజిటివ్ ఫలితాలు రావడంతో మూడు రాజధానులపై ఇంకా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారని, ఉగాది పండుగలోపే అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉండొచ్చని వార్తలు వెలువడుతోన్న వేళ.. మూడు రాజధానుల వ్యవహారంలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది.

చంద్రబాబుకు రాజధాని సెగ..
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుపడుతుండటం, మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై తెలుగు తమ్ముళ్లు కోర్టుల్లోనూ పోరాటాలు చేస్తున్నండటం, అమరావతి రైతులకు ప్రధాన మద్దతుదారుగా టీడీపీ నిలవడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు విశాఖలో రాజధాని సెగ తగిలింది.

విశాఖ రాజధానిపై టీడీపీ వైఖరేంటి?
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు చంద్రబాబు శుక్రవారం విశాఖపట్నం నగరానికి వెళ్లారు. అయితే, ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన సమయం నుంచే ఆయనకు రాజధాని సెగ తగిలింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలంటూ ఉత్తరాంధ్ర బిసి సంఘం పేరుతో మహిళలు బ్యానర్ను ప్రదర్శించారు. దీంతో బాబు రాక సమయంలో స్వల్ప టెన్షన్ ఏర్పడింది.

జగన్ పాలనలో నగరాలు పతనం
గడిచిన 20 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని నగరాలన్నీ పతనం అయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో తిరుపతి స్థానం 4 నుంచి 46కు పడిపోవడం, విజయవాడ 9వ ర్యాంకు నుంచి 41కు పడిపోవడం బాధాకరమన్నారు. ర్యాంకుల పతనం రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిస్థితికి అద్దంపడుతోందని విమర్శించారు. మున్పిపల్ ఎన్నికల్లో వైసీపీ బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications