AP Municipal Strike: ఏపీలో రేపటి నుంచి మున్సిపల్ సమ్మె-డిమాండ్లు ఇవే..!
ఏపీలో మున్సిపల్ కార్మికులు రేపటి నుంచి సమ్మెబాట పట్టబోతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు వైసీపీ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుతూ పురపాలక కార్మికులు రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు.
కనీస వేతనాల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని ఎప్పటినుంచో అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు సమ్మెలోకి వెళ్తున్నారు.

ఏపీలో పలు పురపాలక సంఘాలు, నగర పాలక సంస్ధలు, మేజర్ పంచాయతీల్లో ఇప్పటికే పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెకు కూడా దిగితే పారిశుద్ధ్యం లోపించనుంది. ముఖ్యంగా రోజువారీ తీసుకెళ్లాల్సిన చెత్త పేరుకుపోతే అసలే వైరస్ ల వ్యాప్తి సీజన్ లో మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ నోరు మెదపడం లేదు.
ఇప్పటికే రాష్ట్రంలో అంగన్ వాడీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. విధులు బహిష్కరించి అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతున్నా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో మున్సిపల్ కార్మికులు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ రెండు సమ్మెల్ని ఎలా హ్యాండిల్ చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఎన్నికల వేళ రాష్ట్రంలో కార్మిక సంఘాల వరుస నిరసనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వం కూడా కార్మికులకు నచ్చజెప్పే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మంత్రులు కూడా బిజీగా ఉంటున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులతో ఇప్పట్లో చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications