జగన్ డోన్ట్కేర్: సీఎంగా మీ బాధ్యత..టీడీపీ న్యాయ పోరాటం: చంద్రబాబు ఆందోళన ఏంటంటే..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు. అప్పుడే ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వం పైన రాజకీయంగానే కాదు.. న్యాయ పరంగా పోరాటం మొదలు పెట్టారు. తాము ఇచ్చిన హామీలల్లో పెండింగ్ నిధులను జగన్ విడుదల చేయాలని అది ప్రభుత్వ హామీ అంటూ టీడీపీ వాదిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలుత ఒక ప్రతినిది బృందాన్ని ముఖ్యమంత్రి వద్దకు పంపాలని..ఆయన స్పందన చూసి ఆ తరువాత న్యాయపోరాటానికి దిగాలని పార్టీ నేతలకు నిర్ధేశించారు.
ఆ హామీలు జగన్ పూర్తి చేయాలి..
టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల వేళ రైతులకు సంపూర్ణ రుణ మాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకార సమయంలోనే దీనికి సంబంధించి సంతకం చేసారు. అయినా..2019 ఎన్నికల వరకు కూడా ఆ హమీ అమలు కాలేదు. అయిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మొత్తంగా 87 వేల కోట్ల వరకు ఉన్న రైతుల రుణ మొత్తాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆ మొత్తాన్ని 24,500 కోట్లకు కుదించారు. అందులోనూ 15వేల కోట్ల వరకు దశల వారీగా చెల్లించారు. అదే విధంగా రైతులకు పది శాతం వడ్డీతో బాండ్లు జారీ చేసారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో..తాము పూర్తి స్థాయిలో చెల్లించాల్సిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని..తాము ప్రభుత్వంగా జారీ చేసిన బాండ్లకు చెల్లింపులు చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పై ఉంటుందని వాదిస్తున్నారు. దీని పైన అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులు అభ్యర్దించారు.
జగన్ మాత్రం ససేమిరా..
టీడీపీ నేతలు చేస్తున్న అభ్యర్ధనను..వాదనను ముఖ్యమంత్రి జగన్ ససేమిరా అంటున్నారు. టీడీపీ పార్టీ అధినేతగా ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీ అది..అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయం కాదని జగన్ పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ జగన్ ఇదే అంశం పైన మాట్లాడారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు..అడ్డగోలు నిర్ణయాలతో ఖజానా ఖాళీ చేసిందని..తాము అధికారంలోకి వచ్చిన తరువాత పాత హామీలను అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తాము రైతులకు హామీలు ఇచ్చామని..వాటిని అమలు చేయాల్సిన బాధ్యత తమ మీద ఉందని జగన్ స్పష్టం చేసారు. బ్యాంకులు సైతం గతంలో ఉన్న రుణాలకు..ప్రస్తుతం ఇస్తున్న రుణాలను కలిపి చూపించవద్దని..వాస్తవంగా ఇచ్చే రుణాలనే ప్రస్తావించాలని సీఎం జగన్ స్పష్టం చేసారు.
Recommended Video
చంద్రబాబు ఆందోళన ఏంటంటే..
తాజా ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రధానంగా చంద్రబాబు విశ్వసనీయత మీద దెబ్బ కొట్టారు. చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఏదో రకంగా జగన్ పైన ఒత్తిడి తెచ్చి తాము ఇచ్చిన హామీ అమలు చేయించలేకపోతే...ఇక తాము భవిష్యత్లో ఏం చెప్పినా ప్రజలు నమ్మరనే ఆందోళన మొదలైంది. ఇదే సమయంలో జగన్ ఎన్నికల వేళ తాను ఇచ్చిన హామీ మేరకు రైతులకు 12,500 చొప్పున అందించే పధకానికి ముహూర్తం సైతం ఖరారు చేసారు. జగన్ అమలు చేసిన పధకాన్ని..గతంలో చంద్రబాబు అమలు చేయలేదనే వాదన ద్వారా రాజకీయంగా పూర్తిగా ఆత్మరక్షణలో పడతామనేది చంద్రబాబు ఆందోళన. దీంతో.. ఏదో విధంగా జగన్ ద్వారా తమ హామీ పూర్తి చేయించాలనేది చంద్రబాబు ఆలోచన. తప్పదనుకుంటే న్యాయ పోరాటం ద్వారా ప్రయత్నం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.