పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం- మండలికి ఇక ఆప్షన్ లేదన్న జగన్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే, ఏపీ పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లు-2020 ని సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించింది. దీన్ని మండలికి పంపాల్సి ఉంది. ఈ తరుణంలో సీఎం జగన్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఏపీ పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుపై మాట్లాడిన సీఎం జగన్.. బిల్లు తీసుకురావడం వెనుక నేపథ్యాన్ని వివరించారు.
పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగిందని, ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకొచ్చామని, ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే, వారు దాన్ని వెనక్కి పంపించారని జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేదన్నారు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే అన్నారు.

బిల్లుపై టీడీపీ అభ్యంతరాలపై జగన్ ఆక్షేపణ తెలిపారు. ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారని, ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్టం సవరణ. అదే విధంగా ఏ రకంగా వేగంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నామన్నారు. దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగిందని. ఇక్కడ ఆమోదించి మండలికి పంపిస్తే, వారు వెనక్కి పంపారు. కాబట్టి ఫార్మాలిటీగా ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాం. అంతే తప్ప, ఆయన (చంద్రబాబు) ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు' అని జగన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏపీ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2020ను సభ ఆమోదించింది.












Click it and Unblock the Notifications