ఏపీ పింఛన్ల పంపిణీలో అక్టోబర్ నుండి కొత్త విధానం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర ప్రజల పింఛన్ల పంపిణీల అవకతవకలను నివారించే క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానంలో పింఛన్లు అందించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఏపీలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పింఛన్ పంపిణీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
పించన్ల పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేలా
ఈ క్రమంలోనే తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఎల్ 1ఆర్డీ రిజిస్టర్డ్ వేలిముద్ర స్కానర్ లను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్ల రూపాయలను కేటాయించింది.

డివైజ్ ల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధునిక ఎల్ 1 ఆర్డి డివైజ్ లను తక్షణం కొనుగోలు చేసుకోవాలని సూచించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజ్ ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించి నెలాఖరులోగా వాటిని సేకరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
అక్టోబర్ నుంచి ఎల్ 1 ఆర్డి డివైజ్ లతో పెన్షన్లు
ఎల్ 1 ఆర్డి తో పాటు, 1.3 లక్షల స్కానర్ లను ఈ మేరకు కొనుగోలు చేయనున్నారు. అక్టోబర్ నుంచి ఎల్ 1 ఆర్డి డివైజ్ లు ఉపయోగించి పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు సమాచారం. అయితే అక్టోబర్ నుంచి ఈ డివైజ్ ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుందా అన్నదానిపైన త్వరలోనే స్పష్టత రానుంది.
ఈ విధానం సత్పలితాలను ఇస్తుందా ?
పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నివారించి పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఈ విధానాన్ని త్వరలోనే ప్రారంభించనుంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీలోనూ అవకతవకలు జరిగాయని భావించిన సర్కార్ తాజా విధానంతో పారదర్శక పెన్షన్ విధానాన్ని తీసుకురానుందని సమాచారం. మరి ఈ డివైజ్ లు వచ్చిన తర్వాత పించన్ల పంపిణీ ఎలా జరుగుతుందో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications