చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై వెంటనే దర్యాప్తు చేయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సి ఉండగా.. కేంద్రం ఏం చెయ్యబోతున్నదో బీజేపీకి చెందిన కీలక నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పేశారు. ట్యాపింగ్ ఉదంతంతోపాటు చంద్రబాబుపైనా ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ - డీజీపీపైనా టీడీపీ విసుర్లు - గంటకో ట్విస్ట్..
లేఖలో ఆ ప్రస్తావనేది?
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ చంద్రబాబు.. ప్రధాని మోదీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు రాసిన లేఖలో ఆరోపణలే తప్ప అసలు విషయం లేదని, కనీసం ఎవరి ఫోన్ ట్యాపింగ్ కు గురైందనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పూర్తిగా రాజకీయ అంశం. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. అన్ని అంశాలూ కేంద్రం పరిధిలో ఉండవు''అని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఈ కామెంట్లు చేశారు. అంతేకాదు..
జడ్జిలకు బాబు సహకారమా?
‘‘కోర్టులపై నిఘా పెట్టారని, న్యాయాధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో జడ్జిలకు తెలుసు. ఈ ఉదంతంలో జడ్జీలకు చంద్రబాబు సహకారం ఏమాత్రం అవసరంలేదు'' అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, ‘‘న్యాయవ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న చంద్రబాబు.. గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో స్టే లు ఎలా తెచ్చుకోగలిగారు?'' అని ఎంపీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అక్రమాలను బయటపెట్టి కోర్టుకు ఈడ్చాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోర్టు స్టేలపై బీజేపీ ఎంపీ విమర్శలకు దిగడం అసలుకే ఎసరు పెట్టే ప్రయత్నమా? అనే వాదన వినిపిస్తోంది.
నారా లోకేశ్ మానభంగం చేశారంటే ఊరుకుంటారా? చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సుచరిత కౌంటర్
రెండు రోజులే గడువు..
ఏపీ హైకోర్టులోని కొందరు జడ్జీల ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ ప్రయత్నించారని ఆరోపిస్తూ, దీనిపై సిట్ దర్యాప్తునకు ఆదేశించాలంటూ విశాఖపట్నం జిల్లాకు చెందిన నిమ్మీగ్రేస్ అనే న్యాయవాది హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం కీలక విచారణ జరిగింది. కేసును టేకప్ చేయొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాదితో జడ్జిలు విభేదించారు. రెండు రోజుల్లోగా(ఈనెల 20లోగా) కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, ట్యాపింగ్ పై ఆధారాలుంటే అఫిడవిట్ జత చేయాలంటూ పిటిషనర్ కు సూచించింది.
వైసీపీ లాబీయింగ్.. అంతలోనే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఏపీ సర్కారు బయటపడేలా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని, ముఖ్యనేతలకు ఫోన్లు చేసి వేడుకుంటుననారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆయనా కామెంట్లు చేసిన కొద్ది సేపటికే దీనిపై కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రకటించడం గమనార్హం. అంతకుముందు, ఏపీ బీజేపీకే చెందిన ఐవైఆర్ క్రిష్ణారావు సైతం ఈ ఉదంతంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆధారాలుంటే ఇవ్వాలంటూ చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ లేఖ రాయడాన్ని ‘మాస్టర్ స్ట్రోక్'గా ఐవైఆర్ అభివర్ణించారు.