పవన్ కళ్యాణ్, జగన్ హెచ్చరిక: జైట్లీ రాకతో చంద్రబాబు అప్రమత్తం
అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు ఏపీకి చేరుకున్నారు. ఆయన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు టిడిపి, బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 950 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి రూ.5600 కోట్లు అవసరం అవుతాయని అంచనా.
సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాసగృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. 2018 డిసెంబరు నాటికి భవనాల నిర్మాణం కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాజధాని నిర్మాణానికి 2015 జూన్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు భూమి పూజ నిర్వహించారు. 2015 అక్టోబరు 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. 2016 ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు.
జైట్లీపై ఆశలు
ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధతపై శుక్రవారం స్పష్టత రానుందా? రాజధాని ప్రాంత రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపుపై కేంద్రం సానుకూల ప్రకటన చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి వచ్చిన అరుణ్ జైట్లీతో ప్యాకేజీపై స్పష్టమైన ప్రకటన చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ప్యాకేజీ, హోదా అంశాలపై రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చి, ప్యాకేజీ చట్టబద్ధతపై ప్రకటన ఆవశక్యతను తెలపనున్నారు.
ఇప్పుటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వైయస్ జగన్ హోదా పైన గళమెత్తుతున్నాయి. జగన్ వరుసగా యువభేరీలు నిర్వహిస్తుంటే, పవన్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో జైట్లీ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ప్యాకేజీ విషయమై చట్టబద్దత గురించి మాట్లాడవచ్చని అంటున్నారు.
రానున్న బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురంలో హోదా కోసం పట్టుబడుతూ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వారి హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా జైట్లీ, రాజ్నాథ్, వెంకయ్యలకు పలుమార్లు ఫోన్ చేసి ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు. దీనిపై ఈ రోజు స్పష్టత ఇవ్వవచ్చని చెబుతున్నారు.