కెసిఆర్ 1956 స్థానికత వాదనకు చంద్రబాబు కౌంటర్
హైదరాబాద్: 1956కు ముందు ఉన్నవారినే తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని, ఆంధ్ర విద్యార్థులకు ఆ సౌకర్యం కల్పించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్న వాదనను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు.
1956కు ముందు ఖమ్మం, భద్రాచలం, బీదర్ తెలంగాణలోని ప్రాంతాలు కావని, వాటిని తమకు ఇవ్వాలనే వాదనను ముందుకు తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కెసిఆర్ వాదన ఫీజు రీయింబర్స్మెంట్కు మాత్రమే పరిమితం కాదని, తెలంగాణలోని సీమాంధ్రులను స్థానిక ప్రజలతో సమానంగా చూస్తామని చెప్పిన మాటలకు కూడా కెసిఆర్ తూట్లు పొడవడానికి సిద్ధపడ్డారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక హోదా స్థితిగతులను రాష్ట్రపతి ఉత్తర్వులు 371డి స్పష్టం చేస్తుందని, తమ ప్రాంత ప్రజల స్థానిక హోదాను రక్షించుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు అంటున్నారు. స్థానికతను నిర్ణయించడానికి కెసిఆర్ ఎవరంటూ ఆయన ఆ విధంగా అన్నారు.
నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తి అంతరాయం లేకుండా ఎక్కడ చదువుకుంటే అక్కడ స్థానికుడవుతాడని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతామని ఆయన అన్నారు. స్థానిక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. స్థానిక హోదా అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
ప్రత్యేకాధికారులు కలిగి ఉండడానికి తెలంగాణ వాటికన్ సిటీ కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఓ రాష్ట్రమని, 1956 వాదనను ముందుకు తేవడం ద్వారా కెసిఆర్ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని గంటా శ్రీనివాస రావు అంటున్నారు. స్థానిక హోదాను స్పష్టంగా చెప్పే 1974 ఎపి అడ్మిషన్ల నియంత్రణ ఉత్తర్వులను విస్మరిస్తున్నారని ఆయన కెసిఆర్పై ధ్వజమెత్తారు.