తుళ్లూరు ఫైర్: సమాచారం ఇస్తే రూ.5 లక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాలు అయిన ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో అరటి తోటలు, వ్యవసాయ సామాగ్రిని తగులబెట్టిన వారి ఆచూకీ చెబితే రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐజీ చెప్పారు. నిందితుల కోసం 15 బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భూసమీకరణ ప్రక్రియ మొదలైంది. రైతుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణకు 27 బృందాలను ఏర్పాటు చేశారు. వెయ్యి నుంచి 1400 ఎకరాలు ఒక యూనిట్గా డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పటు చేశారు. ప్రతీ బృందంలో ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు ఉంటారు. జనవరి 15లోగా రైతుల నుంచి ఎక్కువ అంగీకార పత్రాలు స్వీకరించే విధంగా అధికారులు ప్రణాళిలను రూపొందించారు.
రాజధాని నగరి...
ఏపీ రాజధాని నగరం పరిధి 122 కిలోమీటర్లు. ఈ మహా నగరిని నిర్మించే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్రీడ) విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు. ఇది దేశంలోనే మూడో అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థ. ఊహించిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే నవ్యాంధ్ర రాజధానిని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే.
సీమాంధ్రకు రాజధాని లేకుండానే రాష్ర్టాన్ని విభజించారని ఆందోళన చెందుతోన్న ప్రజానీకానికి ఊరట కలిగించేలా భారీ అంచనాలతో క్రీడ చట్టాన్ని తెచ్చింది. ఈ మేరకు క్రీడ బిల్లుకు గవర్నర్ నరసింహన్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే న్యాయ శాఖ దీనిని చట్టంగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి క్రీడ చట్టం అమల్లోకి వచ్చినట్లు అయింది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు సగం ప్రాంతాలను క్రీడ పరిధిలోకి తీసుకొచ్చారు. చట్టం అమల్లోకి రావడంతో ఇప్పటి వరకూ గ్రామాలు, పంచాయతీలుగా ఉన్న ఊళ్లు ఇక నుంచి అర్బన్ పరిధిలోకి రానున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి 80 మండలాలు క్రీడ పరిధిలో ఉంటాయి. క్రీడ ఏర్పాటుతో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పట్టణాభివృద్ధి సంస్థ రద్దయింది. దాంతో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాని పరిధిలోని ప్రాంతాలన్నీ క్రీడ పరిధిలోకి వచ్చాయి.