ఎక్కెడికక్కడ వైసీపీ నేతల అరెస్ట్లు: బాబు తీరుపై మండిపడ్డ భూమన
అమరావతి: విభజన చట్టం అమలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్కు ఇచ్చిన పిలుపులో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్లో భాగంగా తిరుపతిలో ధర్నా చేస్తున్న వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని తరలించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు అడ్డుగా ఉన్న మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు.
అనంతరం భూమనను బలవంతంగా అక్కడి నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్ వద్దకు తరలించారు. స్టేషన్ ఆవరణలో భూమన మీడియాతో మాట్లాడుతుండగా వీడియో కెమెరాలను సైతం అక్కడి నుంచి లాగేసి, కెమెరా లెన్సులకు చేతులు అడ్డుపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

ఈ మొత్తం వ్యవహారంపై కరుణాకర రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నంలో భాగంగా తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో తమను కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళలని కూడా చూడకుండా పైశాచికంగా వాళ్ల చీరలు పట్టుకుని లాగి, జాకెట్లు చించి, ఎక్కడపడితే అక్కడ తన్నారని, గొలుసులు కూడా తెంచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డులో అంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారో చెప్పుకోడానికి సిగ్గుగా ఉందన్నారు.
ఓటుకు నోటు కేసునుంచి బయటపడేందుకు వాళ్ల దగ్గర సాగిలపడి ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు వేంకటేశ్వర స్వామి పాదాలసాక్షిగా తాము అనుభవజ్ఞులమని, హోదా తెస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి ప్రధాని మోడీని రెండుసార్లు కలిశారని, జాతీయ నాయకులకు కూడా హోదా ప్రయోజనాలు, దాని అవసరం గురించి తెలిపారని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో ఆవేదన చెంది రోడ్ల మీదకు వచ్చిన ప్రజాస్వామ్య వాదుల పట్ల ఇప్పుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ, వామపక్షాలు ఇచ్చిన బంద్ విజయవంతం అయ్యేలా కనిపిస్తోంది.
బంద్ కారణంగా 8 బస్ డిపోల్లోని 912 బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ప్రధాన బస్సు డిపోల్లోని బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. వైసీపీ ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications