వరుస అత్యాచార ఘటనలతో అలెర్ట్ అయిన ఏపీ పోలీసులు.. కీలక నిర్ణయాలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిత్యం ఎక్కడో ఒకచోట దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న తీరు ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నేరాల నియంత్రణకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ పోలీసులు అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి, మహిళల్లోనూ దిశ యాప్ వినియోగం గురించి అవగాహన పెంపొందించడానికి విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో దిశ యాప్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు విజయవాడ సిపి కాంతి రాణా టాటా వెల్లడించారు. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లు, వివిధ కాలనీలకు వెళ్లి మహిళలకు దిశా యాప్ ఇన్స్టలేషన్ తో పాటుగా అత్యవసర సమయాల్లో దాన్ని ఏవిధంగా ఉపయోగించాలి అన్న దానిపై అవగాహన కల్పించడానికి మహిళా పోలీసులతో జిల్లావ్యాప్తంగా ప్రత్యేకమైన అవగాహన డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, 24 గంటలూ ఆ వాహనం ద్వారా దిశ ప్రత్యేక బృందాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో నేర ప్రభావిత ప్రాంతాలలో గస్తీ కాస్తాయి అని విజయవాడ సిపి కాంతిరాణా టాటా పేర్కొన్నారు. ఇక నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలు పెంచాలని,అనుమానిత వ్యక్తుల కౌన్సిలింగ్ నిర్వహించాలని,దిశ యాప్ పై ప్రజలకు అవగాహన పెంచాలని పోలీసు సిబ్బందికి సూచించిన విజయవాడ సిపి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
దిశ యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకునేలా చూడాలని సూచించారు. ఆపద సమయంలో వెంటనే దిశ యాప్ ద్వారా నగర పోలీసుల సహకారాన్ని పొందవచ్చని విజయవాడ సిపి కాంతిరాణా టాటా వెల్లడించారు. ఇక మహిళల రక్షణ కోసం నగర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఆయన తెలిపారు. నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications