పోలీసుల అదుపులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ? డ్రైవర్ హత్యకేసులో-నేడు అరెస్టు చూపే ఛాన్స్
సొంత కారు డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే చట్టవిరుద్ధంగా డ్రైవర్ ను అర్ధరాత్రి కారు డిక్కీలో పెట్టుకుని కుటుంబ సభ్యులకు తెచ్చి అప్పగించడం, యాక్సిడెంట్ జరిగినట్లు అబద్ధాలు చెప్పడం, పోలీసుల్ని సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన అనంతబాబు ఇప్పటికీ పరారారీలోనే ఉన్నారు.అయినా పోలీసులు ఇవాళ ఆయన్ను అరెస్టు చేస్తామని ప్రకటించడం విశేషం.

ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు
కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం అనుమానాస్పద హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తొలుత అర్ధరాత్రి అనుమానాస్పద పరిస్ధితుల్లో యాక్సిడెంట్ జరిగిందంటూ సుబ్రమణ్యం బాడీని కుటుంబ సభ్యులకు ఇచ్చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ ఆ తర్వాత ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నా పట్టించుకోని పోలీసులు.. కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల ఆగ్రహంతో ఆత్మరక్షణలో పడ్డారు. చివరికి ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి పోస్టుమార్టంతో పాటు చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

హత్య నిర్ధారణ పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో అతనిది హత్యగా డాక్టర్లు నిర్ధారించారు. సుబ్రమణ్యాన్ని తీవ్రంగా కొట్టడంతో మర్మాంగాలు దెబ్బతిన్నాయని నివేదికలో తేలింది. అలాగే గొంతుపై కాలితో తొక్కడంతో ఊపిరాడక చనిపోయినట్లు నిర్ధారణ అయిందని డాక్టర్లు తేల్చారు. తొలుత కొన ఊపిరితో ఉన్న డ్రైవర్ ను ఎమ్మెల్సీ ఆస్పత్రికి తెచ్చారని, డాక్టర్లు చనిపోయినట్లు నిర్దారించడంతో కుటుంబ సభ్యులకు తీసుకెళ్లి అప్పగించారని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది.

పోలీసుల అదుపులోనే ఎమ్మెల్సీ ?
పోలీసుల అదుపులోనే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ హత్య తర్వాత
ఎమ్మెల్సీ బహిరంగంగా తిరగడంపై విమర్శలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దళిత సంఘాలతో పాటు కుటుంబ సభ్యులుకూడా తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ఆదివారం పోలీసు స్టేషన్ లో ఉంచితే ప్రమాదమని భావించి ఉదయ్ భాస్కర్ ను వేరే ప్రదేశంలో ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసు ఇవాళ వివరాలు వెల్లడించనున్నారు.

నేడు అరెస్టు చూపే అవకాశం
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో దళిత సంఘాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి, విపక్షాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఇవాళ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న అనంతబాబును పోలీసులు ఇవాళ అరెస్టు చేసినట్లు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని, ఐదు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయని చెబుతున్న పోలీసులు.. ఇవాళ ఎమ్మెల్సీని అరెస్టు చేస్తామని కూడా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి అందిన ఆదేశాల మేరకు ఇవాళ అరెస్టు ప్రక్రియ పూర్తి చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.












Click it and Unblock the Notifications