ఏపీలో లాక్ డౌన్ బేఖాతర్.. పేదలకు సాయం పేరుతో నేతలు రోడ్లపైకి...
ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ముగియడానికి మరో నాలుగు రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా పోలీసులు జనం రోడ్లపైకి రాకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఉదయం షాపింగ్ సమయాలను అడ్డుపెట్టుకుని పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ పేరుతో నేతలు రోడ్లపైకి వస్తుండటం పోలీసులకు సైతం తలనొప్పిగా మారుతోంది. అటు నేతల రాక పెరగడంతో జనంలోనూ కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Recommended Video
స్ధానిక పోరు వాయిదా నేపథ్యం..
ఏపీలో స్ధానిక పోరు వాయిదా పడటం కాదు కానీ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులకు దిక్కు తోచకుండా పోయింది. ఉద్ధృతంగా ప్రచారం సాగుతున్న వేళ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా పడటంతో కొన్నాళ్లు ఇళ్లలోనే ఉండిపోయిన అభ్యర్ధులు ప్రజల్లోకి ఎలా వెళ్లాలా అని ఆలోచించారు. చివరికి లాక్ డౌన్ కారణంగా పేదలు పడుతున్న ఇబ్బందుల రూపంలో వీరికి మంచి అవకాశం దొరికింది.
లాక్ డౌన్ పట్టించుకోకుండా..
లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రజలు ఉదయం వేళల్లో షాపింగ్ చేసుకోవడానికి మాత్రమే వీలుంది. పరిమిత సమయంలో షాపింగ్ చేసుకుని తిరిగి ఇళ్లకు చేరుకోవాలని లాక్ డౌన్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇంటిపట్టునే ఉంటే వీళ్లంతా రాజకీయ నేతలు ఎలా అవుతారు. అందుకే పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామంటూ ఉదయాన్నే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాక్ డౌన్ సమయాలు ముగిసినా మురికివాడలకు వెళ్లి మరీ నిత్యావసరాలు పంచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
వాహనాల్లో పంపే అవకాశమున్నా..
అంతగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పేదలకు పంచాలని భావిస్తే ఇళ్లకు వాహనాల్లో తరలిస్తే సరిపోతుంది. కానీ అలా చేస్తే అభ్యర్ధులకు ప్రచారం ఎలా దొరుకుతుంది. దీంతో నేరుగా సరుకులు పంపిణీ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఎంచక్కా ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు గోడౌన్లలో సరుకులు ఉంచి అక్కడికే జనాన్ని రప్పించుకుని పంపిణీ చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న పోలీసులు..
సాధారణ ప్రజలు బయటికి వస్తే లాక్ డౌన్ పేరుతో నడ్డి విరగ్గొడుతున్న పోలీసులు.. రాజకీయ నేతల విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్దితి. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. కానీ నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతూ నిత్యావసరాల పంపిణీ పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఎవరిపై చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అన్న భయంతో నేతలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో జనంలోనూ కరోనా వ్యాప్తి భయాలు పెరుగుతున్నాయి.