జగన్ వర్సెస్ విపక్షాలు-టార్గెట్ ఫిక్స్ చేసిన తిరుపతి సభ- 2009 రిపీట్ అవుతుందా ?
ఏపీలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీతో పాటు ప్రధాన విపక్ష పార్టీలు కూడా ఎవరికి వారుగా పోటీ చేశాయి. దీంతో వైసీపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీకి పోటీగా టీడీపీ, జనసేన, బీజేపీ రంగంలోకి దిగడంతో స్వల్ప తేడాతో అధికారం చేపట్టగలిగారు. ఇప్పుడు మరోసారి తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ ద్వారా విపక్షం అంతకు మించిన ఐక్యతను చాటుకోలిగింది. దీంతో ఈసారి ప్రత్యర్ధుల్ని తన తండ్రి తరహాలోనే ఏకమొత్తంగా ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమయ్యారు.
ఏపీలో విపక్షాల ఐక్యత
ఏపీలో విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం అన్నీ ఒకతాటిపైకి వస్తాయని ఎవరన్నా అంటే గతంలో నమ్మే పరిస్ధితి లేదు. కానీ తాజాగా తిరుపతిలో అమరావతి రైతులు రాజధాని కోసం నిర్వహించిన సభ వీరందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ఇందులో ఒక్క సీపీఎం మాత్రం ఈ సభకు దూరంగా ఉన్నా అమరావతి రాజధాని నినాదాన్ని మాత్రం సమర్ధించింది. బీజేపీతో వేదిక పంచుకునేందుకు ఇష్టపడకపోయినా విపక్షాల అజెండాకు మద్దతు పలికింది. దీంతో ఏపీలో ఎన్నడూ లేనంత స్ధాయిలో విపక్షాల ఐక్యత కనిపిస్తోంది.
జగన్ వర్సెస్ విపక్షాలు
గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో అధికార వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న విపక్ష పార్టీలు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభ ఇందుకు చక్కటి అవకాశం కల్పించింది. దీంతో విపక్షాలు అధికార వైసీపీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఇందులో బీజేపీ, కమ్యూనిస్టుల కలయిక కష్టమే అయినా బీజేపీతో ఇప్పటికే కలిసున్న జనసేనతో పాటు టీడీపీ కూడా ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పుడు అమరావతి అజెండాపై కలిసిన విపక్షం.. భవిష్యత్తులో జగన్ కు సవాళ్లు విసరబోతోంది. టోటల్ గా జగన్ వర్సెస్ విపక్షాలుగా ఏపీ రాజకీయం మారబోతోంది.
2024 ఎన్నికల పోరు ముందే ఫిక్స్
2024 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ కలుస్తాయో లేదో, జనసేన బీజేపీతో ఉంటుందో లేక టీడీపీతో కలిసి పోరాడుతుందో, వీరికి కలిసొచ్చే ఇతర సమీకరణాలు ఏంటని ఆలోచిస్తున్న వైసీపీకి ఇప్పుడు తిరుపతి సభతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఉమ్మడిగా పోరుకు సిద్ధమవుతున్న విపక్షాన్ని ఎదుర్కోవాల్సిందేనని వైసీపీకి తేలిపోయింది. దీంతో ఇప్పటినుంచే వైసీపీ.. విపక్షాలతో పోరు కోసం అజెండా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్దితి. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు జగన్ వర్సెస్ విపక్షాలుగా మారుతున్న సంకేతాలు వచ్చేశాయి.
వైఎస్ బాటలోనే జగన్
గతంలో విపక్షాల్ని ఒంటి చేత్తో ఎదుర్కొని గెలిచిన చరిత్ర జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉంది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి రూపంలో విపక్షమంతా కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీ చేసింది. దీంతో అప్పట్లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుపు కష్టమేనని అంతా భావించారు. కానీ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర వైఎస్ ది. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఫ్రీహ్యాండ్ ఇస్తే మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని హామీ ఇచ్చి మరీ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర వైఎస్ ది. ఇప్పుడు తండ్రి బాటలోనే వైసీపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్ధితి జగన్ కు ఎదురవుతోంది.
వైఎస్ తరహాలోనే జగన్ గెలుస్తారా ?
గతంలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో అంతకముందు తమకు మిత్రపక్షాలుగా ఉన్న వారంతా టీడీపికి అండగా నిలవడంతో కాంగ్రెస్ ను గెలిపించాల్సి బాధ్యత వైఎస్సార్ పై పడింది. దాన్నో సవాల్ గా తీసుకుని జనాల్లోకి వెళ్లి తన పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి వైఎస్ గెలిచారు, కాంగ్రెస్ ను గెలిపించారు. ఇప్పుడు జగన్ కూడా అంతకు మించిన పథకాలతో ముందుకెళ్తున్నారు. వీటిపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. విపక్షం తనకు వ్యతిరేకంగా ఏకమవుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కొని తండ్రి వైఎస్సార్ గెలిచిన తరహాలోనే జగన్ కూడా గెలుస్తారా లేదా అన్నది 2024 ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న జగన్ 2024 వరకూ అదే ఊపు కొనసాగించగలిగితే తండ్రి విజయాన్ని రిపీట్ చేయడం కష్టం కాకపోవచ్చనేది రాజకీయ పండితుల అంచనా.