ఏపీలో రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల గుడ్ న్యూస్..!
ఏపీలో నెల రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద చికిత్సల కోసం వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. దీనికి కారణం స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కు ప్రభుత్వం ఈ చికిత్సల కోసం చెల్లించాల్సిన రీయింబర్స్ మెంట్ మొత్తం చెల్లించకపోవడమే. దీంతో ఆయా ఆస్పత్రులు సేవల్ని నిలిపేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం తమకు బకాయి పెట్టిన రూ.2700 కోట్లు చెల్లిస్తే కానీ తాము ఎన్టీఆర్ వైద్య సేవల్ని పునరుద్దరించబోమని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చిచెప్పేశాయి. దీంతో ప్రభుత్వం వారికి ప్రస్తుతానికి రూ.250 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీనికి ఆయా ఆస్పత్రులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో దఫా ప్రైవేటు ఆస్పత్రుల సంఘంతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. ఇవి ఫలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోని నెట్వర్క్ ఆస్పత్రులతో జరిపిన చర్చలు సఫలం అయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించేందుకు అంగీకరించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు గాను పది రోజుల్లో రూ.670 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 15 రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చింది. దీంతో ఆస్పత్రులు వెనక్కి తగ్గాయి.

ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిల్ని చెల్లించేందుకు అధికారులు ముందుకు రాకపోవడం, పలుమార్లు వినతులు పంపుతున్నా పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలు నిలిపేసారు. అయితే ప్రస్తుతానికి 670 కోట్లు చెల్లించే హామీ ఇవ్వడంతో ఆస్పత్రులు సేవలు పునరుద్ఱరించాయి. అన్న మాట ప్రకారం 10 రోజుల్లో ఈ మొత్తం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications