ఏపీ ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 2600 ఫ్రీ సీట్లు-జగన్ సర్కార్ కేటాయింపు-హైకోర్టు హెచ్చరికలతో
ఏపీలో భారీ ఎత్తున విద్యాసంస్కరణలు అమలుచేస్తున్న వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు దీన్ని వెంటనే అమల్లో కూడా పెట్టేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేదలకు విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయిస్తూ గతంలోనే నిర్ణయంతీసుకున్న ప్రభుత్వం అమల్లో మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. తాజాగా హైకోర్టు దీనిపై కన్నెర్ర చేయడంతో అధికారులు ముందుకు కదిలారు.
ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులతో పాటు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలోనూ 25 శాతం సీట్లను పేదలకు కేటాయిస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని అమలు చేయడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. దీంతో హైకోర్టులో కోర్టు ధిక్కారం కింద పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో హైకోర్టు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేదలకు సీట్లు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్లు వేసారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జైలుకు పంపుతామని అధికారులకు హైకోర్టు వార్నింగ్
పేదలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించాల్సిందేనంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లను హైకోర్టు విచారించింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సీఎస్, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు సీట్లిస్తారా లేక మీకు జైల్లో సీట్లు ఇమ్మంటారా అని ప్రశ్నించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ముందుకు కదిలారు. పేదలకు ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు.
పేదలకు 2600 ఫ్రీ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేదలకు విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్ల కేటాయింపుపై గతంలోనే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు తాజాగా దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. దీంతో 5 వేల మంది వరకూ పేదలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయిన వారితో పాటు ఇంకా స్కూళ్లకు దూరంగా ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే వీరిలో 3519 మంది మాత్రమే స్కూళ్ల ఎంపిక కోసం ఆప్షన్స్ ఇచ్చారు. వీరిలో 2600 మందికి ప్రభుత్వం తాజాగా సీట్లు కేటాయించింది. వీరి వివరాలను సైతం వెబ్ సైట్ లో ఉంచారు.
విద్యార్ధులకు కలిగే లబ్ధి ఇదే..
విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఇలా ప్రైవేటు విద్యాసంస్ధల్లో ఇస్తున్న ఫ్రీ సీట్లు తీసుకున్న విద్యార్ధులకు పలు అంశాల్లో లబ్ది చేకూరబోతోంది. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తున్న విద్యాకిట్లను వీరికి కూడా ఇవ్వబోతున్నారు. అలాగే వీరి ఫీజుల్ని కూడా ప్రభుత్వమే చెల్లించబోతోంది. దీంతో ఆయా పేద విద్యార్ధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రైవేటు స్కూళ్లలో నాణ్యమైన విద్యాభ్యాసం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే నాణ్యత ఉండే ప్రైవేటు స్కూళ్లలోనే వీరు సీట్లు పొందుతారు కాబట్టి వారికి ఆ మేరకు ప్రయోజనం కలగబోతోంది.