ఏపీలో ఇసుక రీచుల పేరిట భారీ మోసం : IAS గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ..!!
ఏపీలో ఇసుక దుమారం పూర్తిగా చల్లారలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ పైన ఇంకా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ-పర్మిట్ల ద్వారా ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ ను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇదే సమయంలో ఏపీలో ఇసుక రీచ్ ల పేరిట చోటు చేసుకున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామని 3.50 కోట్లు వసూలు చేసిన కేటుగాడి ఉదంతం బయట పడింది. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ IAS అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఏపీలో జేపీ గ్రూపుకు ఇసుక రీచ్ ల వేలం కాంట్రాక్టును ప్రభుత్వం అప్పగించింది.
అయితే, ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు గురించి పూర్తిగా తెలుసుకున్న కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫోర్జరీకి పాల్పడి కోట్లు దండుకున్నాడు. ఇదే నిందితుడు పైన హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఆర్దిక శాఖ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసారంటూ 2018 లో కేసు నమోదైంది. ఈ ఫోర్జరీ సంతకాల ద్వారా ఏపీ వ్యాప్తంగా ఏడుగురు బాధితుల నుంచి 3.50 కోట్లు వసూలు చేసినట్లు విచారణతో తేలింది. దీనిని గుర్తించి..అధికారులతో చర్చించిన జేపీ గ్రూప్ మేనేజర్ హర్ష కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బెజవాడ భవానీ పురం లో FIR నమోదు అయింది. నిందితుడి పైన 471, 420, 465, 469, 471, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. విచారణ చేసిన పోలీసులు నిందితుడు బ్యాంకు ఖాతా నుండి రెండు కోట్లు సీజ్ చేసారు. విచారణ కొనసాగుతోంది.

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విధానం అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అనుమతి పొందిన జేపీ పవర్ వెంచర్స్ తవ్వకాలకు సంబంధించి ఈ పర్మిట్ పొందాలి. దీని కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు కోరిన ప్రాంతంలోని గనుల శాఖ సహాయ సంచాలకుల ద్వారా వాటి పరిశీలన..అననుమతి వెంటనే లభించేలా ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా ఎక్కడ..ఎంత మేర మైనింగ్ జరిగిందనేది ప్రభుత్వం వద్ద పక్క లెక్కలు..సమాచారం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇక, ఇప్పుడు తాజాగా జరిగిన ఫోర్జరీ వ్యవహారంతో ప్రభుత్వంలోని ఐటీ విభాగం మరింతగా అప్రమత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications