కనగరాజు గుట్టు విప్పిన చంద్రబాబు.. ఎస్ఈసీ వివాదంలో కొత్త ట్విస్ట్, ప్రభుత్వం ఫిక్స్ అయ్యిందా..?
అమరావతి: ఎన్నికల కమిషనర్ వివాదం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంది. తమకు సమాచారం ఇవ్వకుండా కరోనా పేరుతో అర్థాంతరంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. చివరకు ఆర్డినెన్స్ ద్వారా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆ వివాదం న్యాయ పరిధిలో ఉంది. దీనిపైన రాజకీయంగాను విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కొత్త ఆరోపణ ఈ వివాదానికి మరింత వేడి రగిల్చింది. ఇంతకీ కనగరాజన్ ఎలా వచ్చారు..?
అంతా గోప్యంగానే...
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల పేరుతో ఎలాగైనా నిమ్మగడ్డను తప్పించి కొత్తవారిని నియమించాలని అదే సమయంలో సామాజిక ప్రాంతీయ పరంగా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. నిమ్మగడ్డను స్వయంగా ముఖ్యమంత్రి కులం పేరు పెట్టి మాట్లాడటంతో రాష్ట్రానికి చెందిన వారికి ఆ పదవి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్నికల కమిషనర్ నియామకంలో అర్హతలను మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి గవర్నర్ ఆమోదం పొంది అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారు. ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించాలనేది ఆర్డినెన్స్ సారాంశం. ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వంలోని ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తుల వద్ద మాత్రమే సమాచారం ఉంది.
కొత్త ఎస్ఈసీ కనగరాజ్ విజయవాడకు ఎలా వచ్చారు..?
ఇక కొత్త ఎన్నికల కమిషనర్ ఎంపిక ఆయన బాధ్యతల స్వీకరణ సైతం అంతే నాటకీయంగా సాగింది. రమేష్ కుమార్ను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆ జీవోలను కాన్ఫిడెన్షియల్గా ఉంచింది. దీంతో రిటైర్డ్ హైకోర్టు జడ్జి హోదాలో ఎన్నికల కమిషనర్ ఎవరు కాబోతున్నారనేది పెద్ద చర్చ సాగింది. అనూహ్యంగా కొత్త ఎన్నికల కమిషన్ నియామకం ఆయన బాధ్యతల స్వీకరణ నిమిషాల తేడాలో జరిగిపోయింది. ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్కు ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. తమిళనాడుకు చెందిన కనగరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగానే సమాచారం వెళ్లింది. అంత సడెన్గా బాధ్యతలు స్వీకరించేందుకు విజయవాడలో ప్రత్యక్ష్యం అవడం ద్వారా ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగానే ఆయన్ను విజయవాడ రప్పించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపైన రాజకీయంగాను విమర్శలు వచ్చాయి. ఆయన చెన్నై నుంచి వచ్చారా లేక ఢిల్లీ నుంచి వచ్చారా అనేదానిపై కూడా చర్చ జరిగింది. అయితే ఎక్కడి నుంచి రాష్ట్రంలోకి వచ్చినా ఏ స్థాయిలో వారైనా క్వారంటైన్కు పంపకుండా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రతిపక్షాలు నిలదీశాయి.
గుట్టు విప్పి ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసిన చంద్రబాబు..?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ జరుగుతున్న వేళ ఆయన విజయవాడకు ఎలా రాగలగారనే దానిపై కూడా ప్రశ్నలు సంధించారు. కానీ వీటికి ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. అయితే తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త ఎన్నికల కమిషనర్ ఏపీకి ఎలా వచ్చారనే విషయాన్ని బయటపెట్టారు. తమిళనాడు నుంచి విజయవాడకు కనగరాజును అంబులెన్స్లో తీసుకురావాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. అయితే చంద్రబాబు రాజకీయ ఆరోపణల కోసమే అలా మాట్లాడారా లేక నిజంగానే అంబులెన్స్లోనే కనగరాజు ఏపీకి తీసుకొచ్చారా..? మరి క్వారంటైన్కు ఎందుకు పంపలేదు..? తాజాగా చంద్రబాబు విమర్శలతో ప్రభుత్వం ఈ కొత్త చర్చకు స్పష్టమైన సమాధానంతో ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైకోర్టు ఈనెల 28న తీర్పు ఎలా ఉంటుందనేదానిపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అంబులెన్స్లో ఎన్నికల కమిషనర్ విజయవాడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారనేది మాత్రం జాతీయ స్థాయిలో హాట్టాపిక్ కానుంది.