జగన్ ‘‘నా ఇష్టం-నా పాలన’’ ధోరణి వీడాలి - నిమ్మగడ్డ ఇష్యూపై చంద్రబాబు స్పందన..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో జగన్ సర్కారుకు షాకిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు స్వాగతించారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరగా, అందుకు సుప్రీం నిరాకరించడం, అదేసమయంలో జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఎవరైనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లాలిగానీ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం అనుమతి ఇవ్వండి అంటూ వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయని జగన్ సర్కారును ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా జగన్ 'నా ఇష్టం-నా పాలన' అనే పెడధోరణి పక్కనపెట్టాలని సూచించారు.

ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తుల కన్నా వ్యవస్థలే ముఖ్యమనే విషయాన్ని వైసీపీ గుర్తించాలని, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు. కోర్టులు, గవర్నర్ ఆదేశించిన తర్వాత కూడా నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమించక పోవడాన్ని సుప్రీంకోర్టు గర్హించింది. ఈ విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన గాడితప్పిందనడానికి, ప్రభుత్వమే రాజ్యాంగాన్ని విస్మరిస్తోందనడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని, ఇప్పటికైనా సీఎం జగన్, వైసీపీ నేతలు రాజ్యాంగ విలువలను తెలిసి నడచుకోవాలని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications