రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ- వైసీపీ హాజరు- టీడీపీ, బీజేపీ, జనసేన డుమ్మా
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు హాజరు కాగా.. విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బహిష్కరించాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయస్ధానాల్లో కేసులు పెండింగ్లో ఉండగా.. పాత నోటిఫికేషన్తో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎస్ఈసీ నీలం సాహ్నీ నిన్న షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 8న పోలింగ్, 10న కౌంటింగ్ జరగనున్నాయి. దీనిపై విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన భగ్గుమన్నాయి. ఇవాళ రాజకీయ పార్టీలతో భేటీకి పిలిచి ఆ లోపే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆయా పార్టీలు తప్పుబట్టాయి. ఈ కారణంతో ఎస్ఈసీ నిర్వహిస్తున్న భేటీకి గైర్హాజరయ్యాయి. వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం తరఫున వైవీ రాఘవులు కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ ఈ భేటీకి హాజరయ్యారు.
ఏపీలో గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే పలు ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి. ఇందులో వైసీపీ అధికారబలంతో పలు చోట్ల ఏకగ్రీవాలు చేయించుకుందని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో గత ఎస్ఈసీకి కూడా పాత నోటిఫికేషన్తో ఎన్నికలు వద్దని కోరిన ఆయా పార్టీలు కొత్త నోటిఫికేషన్ కోసం పట్టుబట్టాయి. ఇదే అంశంపై జనసేన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై తీర్పు పెండింగ్లో ఉండగానే ఎస్ఈసీ పాత నోటిఫికేషన్తో ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చేశారు. దీంతో ఆయా పార్టీలు ఎన్నికలపై నిర్వహిస్తున్న భేటీని బహిష్కరించాయి.