జగన్ సర్కారుపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు- మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ జరిగేనా ?
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుతగలడాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ సంస్ధల వద్దే తేల్చుకోవడానికి సిద్ధమైన నిమ్మగడ్డ ఇవాళ విజయవాడ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. స్ధానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ హరిచందన్తో అరగంటపాటు భేటీ అయిన నిమ్మగడ్డ పలు అంశాలపై ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆయన గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలనే ప్రధానంగా ఈ భేటీలో ఆయనకు మరోమారు ఫిర్యాదు చేశారు. ఇందులో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు కరోనాను కారణంగా చూపుతున్న ప్రభుత్వ వైఖరితో పాటు ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనకుండా అడ్డుకోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఎన్నికలతో లింక్ చేసి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించొద్దంటూ సీఎస్ రాసిన లేఖతో పాటు తాజా పరిణామాలను నిమ్మగడ్డ గవర్నర్తో పంచుకున్నారు.

మరోవైపు రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు నిమ్మగడ్డ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడ నుంచి వీడీయో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో స్ధానికంగా ఉన్న పరిస్ధితులను తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని చెబుతోంది. ఇప్పటికే సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ ఏర్పాటు చేసిన సమావేశానికి ఒకవేళ కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోతే నిమ్మగడ్డ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications