పంచాయతీ ఓట్ల లెక్కింపుపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు- హైకోర్టు సూచన మేరకే
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడోదశకు చేరుకుంది. నాలుగు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు విజయవంతంగా పూర్తి కాగా..ఇప్పుడు మూడో దశ జరుగుతోంది. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే కౌంటింగ్పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు.
పరిషత్ పోరులోనూ వైసీపీకి నిమ్మగడ్డ షాక్- నామినేషన్ల పునరుద్ధరణ- కీలక ఆదేశాలు
రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నిశితంగా దృష్టిసారించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియను వీడియో షూటింగ్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ ద్వారా నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చిత్రీకరించిన వీడియోలను జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు.ఎన్నికల కౌంటింగ్పై ఏవైనా ఫిర్యాదులు వస్తే ఈ దృశ్యాలు కీలకంగా మారనున్నాయని ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే విపక్షాల నుంచి కౌంటింగ్ అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్న వేళ నిమ్మగడ్డ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.