జిల్లాల్లో మంత్రుల పర్యటనలకు బ్రేక్: ఎమ్మెల్యేలకూ వర్తింపు: రీషెడ్యుల్ బాధ్యుడాయనే: నిమ్మగడ్డ
అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వ్యవహార శైలిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతోన్న వేళ.. ఆయన మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ సారీ మంత్రులనే టార్గెట్గా చేసుకున్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో ప్రవర్తనా నియమావళి సరిగ్గా అమలు కావట్లేదంటూ నిమ్మగడ్డ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను తాను గుర్తు చేయాల్సి వస్తోందని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో మంత్రులు పర్యటించకూడదని నిమ్మగడ్డ ఆదేశించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తన జిల్లాల పర్యటన సందర్భంగా.. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల పరిధిలో కోడ్ సక్రమంగా అమలు కావట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఎన్నికలు జరిగే ప్రాంతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించారు.
సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను తన ఆదేశాల మేరకు విధుల నుంచి తక్షణమే తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఆదేశించారు. దీనిపై తాను ఇచ్చిన ఆదేశాలు ఇంతవరకూ అమలు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ తన విధి నిర్వహణలో విఫలం అయ్యారని, ఆయన వల్లే ఎన్నికల షెడ్యూల్ను మళ్లీ కొత్తగా జారీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన ఆదేశాలను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.