హైపిచ్: సీఎం కోటరీలో కలకలం: జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన నిమ్మగడ్డ: సీఎంఓ కీలక అధికారిపై
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య ఆరంభమైన విభేదాలు ఇక పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. తొలిదశ పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఈ విభేదాలు, వివాదాలు మరింత ముదిరిపోతోన్నాయే తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలను గుప్పిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక అస్త్రాన్ని సంధించారాయన.
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తోన్న ఆయనను విధుల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు కొద్దిసేపటి కిందటే ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ప్రవీణ్ ప్రకాష్కు పేరుంది. కొన్ని కీలక కార్యక్రమాల రూపకల్పన, పథకాల్లో ప్రవీణ్ ప్రకాష్ ప్రమేయం ఉందనే అభిప్రాయాలు ఇదివరకే వ్యక్తం అయ్యాయి.
అలాంటి అధికారిని విధుల నుంచి తప్పించాలంటూ తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం ముఖ్యమంత్రి కోటరీలో కలకలం పుట్టిస్తోంది. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు నారాయణ్ భరత్ గుప్తా, ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్లతో పాటు తిరుపతి అర్బన్ పోలీస్ సూపరింటెండెంట్ ఆవుల రమేష్ రెడ్డిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. నారాయణ్ భరత్ గుప్తా, శామ్యుల్ ఆనంద్ కుమార్లకు పోస్టింగులు ఇచ్చినప్పటికీ.. నిమ్మగడ్డ ఆదేశాల మేరకే వారిని ఇదివరకటి స్థానాల నుంచి బదిలీ చేసింది.
తాజాగా- నిమ్మగడ్డ ఫోకస్.. కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంపై పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రవీణ్ ప్రకాష్ను తొలగించాలంటూ ఆదేశించడం చర్చనీయాంశమౌతోంది. తాను ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శిగా తాను నియమించుకోదలిచిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాజా నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని ఆయన విడనాడట్లేదని మండిపడుతున్నారు.