సీనియర్ మంత్రుల షాక్: నారా లోకేష్కు చుక్కెదురు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్కు సీనియర్ మంత్రుల నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. లోకేష్ ప్రతిపాదించిన మీడియా లైజనింగ్ వ్యవస్థను వారు తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ అధికారుల వ్యవస్థ తమకు సమ్మతం కాదని వారు నారా లోకేష్కు తేల్చి చెప్పినట్లు సమాచారం.
మంత్రుల పేషీల్లో 20 మందిని మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించాలని లోకేష్ ప్రతిపాదించారు. అయితే, తమపై నిఘా పెట్టడానికే ఆ ప్రతిపాదన చేశారని మంత్రులు భావించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉంటున్న తమపై ఈ రకమైన నిఘా ఏమిటని వారు ఉడుక్కున్నట్లు చెబుతున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, కెఇ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు మీడియా లైజనింగ్ అధికారుల నియామకం ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

కొంత మంది మంత్రులు తమ సొంత మనుషులనే పిఆర్వోలుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వారినే మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించుకోవాలని వారు సూచించినట్లు సమాచారం. అలాగే సిసి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనను కూడా మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలు చూస్తుండగా, నారా లోకేష్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. పార్టీ పగ్గాలు దాదాపుగా లోకేష్ చేతికి వచ్చినట్లు చెబుతున్నారు. సీనియర్ నేతలు కూడా ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, తమపై నిఘా పెట్టే రీతిలో వ్యవహరించడం సరి కాదనే అభిప్రాయంతో వారు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications