వీరికి కరోనా వచ్చింది...పోయింది... ఆసక్తికరంగా ఏపీ సీరో సర్వైలెన్స్ సర్వే ఫలితాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సకాలంలో పరీక్షలు, చికిత్స ద్వారా నయమై కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అయితే వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించకుండా, కొంత కాలానికి వాటంతట అవే తగ్గిపోతున్నట్లు తాజాగా తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని ఇలాంటి వారిని గుర్తించేందుకు సీరో సర్వైలెన్స్ సర్వే చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేస్తున్న సూచనల మేరకు వివిధ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించింది.

సీరో సర్వైలెన్స్ సర్వే...
ప్రస్తుతం సమాజంలో దాదాపు ప్రతీ నలుగురిలో ఒకరు కరోనా బాధితులుగా కనిపిస్తున్న తరుణంలో అసలు ఎవరికి కరోనా సోకింది, ఎవరు సురక్షితంగా ఉన్నారు, కరోనా సోకినా తెలియలేదా అనే అంశాలు క్షుణ్ణంగా తెలియాలంటే సీరో సర్వైలెన్స్ పరీక్షలు నిర్వహిస్తే సరిపోతుంది. ప్రతీ ఒక్క మనిషిలో రోగాలు, వైరస్లతో పోరాడే రోగ నిరోధకాలు లేదా యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ఉంటాయి. వీటి శాతం ఆధారంగా సదరు మనిషి సదరు వైరస్ల ప్రభావానికి గురయ్యాడా లేదా, గురైతే ఎంత మేర అనే విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ సీరో సర్వైలెన్స్ పరీక్షలను తరచుగా నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మనిషి శరీరంలో రోగనిరోధకాల శాతం తెలుసుకుని అవసరమైన వారికి చికిత్స అందిస్తారు.

ఏపీలో ప్రయోగాత్మకంగా ...
కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏపీలోనూ సీరో సర్వైలెన్స్ పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్ ఆదేశాలు ఇచ్చింది వీటి ప్రకారం ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ పరీక్షలను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పరీక్షలు చేపట్టారు. ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసిన వారిని పరీక్షించారు. వీరి శరీరంలో యాంటీబాడీల శాతం ఎంత మేర ఉంది, కరోనా సోకిన వారు ఎందరు, కోలుకున్న వారు ఎందరు అనే విషయాలు వీటిలో పరీక్షించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సీరో సర్వైలెన్స్ పరీక్షల ఫలితాలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.

వీరికి వైరస్ వచ్చిపోయింది...
తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో ఒక్కో చోట దాదాపు 4 వేల శాంపిళ్లను సేకరించింది. అర్బన్లో 30 శాతం, రూరల్లో 70 శాతం మందిని పరీక్షించారు. అదీ స్ధానికంగా కరోనా వచ్చిన వారు, పురుషులు, మహిళలు ఇలా వర్గీకరించి మరీ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ సీరో సర్వైలెన్స్ పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 20 శాతం మందికి కరోనా వైరస్ వచ్చిందని, పోయిందని నిర్ధారణ అయింది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 15 శాతం మందికీ ఇదే విధంగా జరిగింది. అనంతపురం జిల్లాలో 12 నుంచి 14 శాతం మందికి, నెల్లూరు జిల్లాలో 9 శాతం మందికి కరోనా సోకింది అయినా వారికి తెలియకుండానే తగ్గిపోయింది. వీరంతా కరోనా వచ్చినా ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఇంకా జనంలోనే తిరుగుతున్నారు.
Recommended Video

కృష్ణాలో అందుకే తక్కువ కేసులు..
తాజాగా గత పది రోజులుగా విడుదలవుతున్న కరోనా పరీక్షల ఫలితాల్లో వైరస్ సోకిన వారిలో కృష్ణా జిల్లా చివరి స్ధానంలో ఉంటోంది. జిల్లాలో అత్యల్పంగా దాదాపు రోజుకు 250 మందికి మాత్రమే కరోనా సోకుతోంది. ఇది రాష్ట్ర సగటుతో పోల్చినా తక్కువే. దీనికి కారణం ఇక్కడ నిర్వహిస్తున్న అత్యధిక పరీక్షలే అని అధికారులు చెప్తున్నారు. అయితే సీరం సర్వైలెన్స్ పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నట్లు, అలాగే జనంలో కరోనా వచ్చిపోయినట్లు కూడా
తేలింది. ఇలా కరోనా సోకినా లక్షణాలు కనిపించకుండా తగ్గిపోయిన వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం లేదు. ఆ లెక్కన సర్వే జరిపిన నాలుగు జిల్లాల్లో ఒకటైన కృష్ణాలో కరోనా వచ్చిపోయిన వారి శాతం 20గా ఉండటంతో ఈ జిల్లాలో కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉందని తేలింది.












Click it and Unblock the Notifications