రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్..! మూడ్రోజులే గడువు..!
ఏపీలో రేషన్ పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ గత ఏడాది కాలంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు, అసలు లబ్దిదారులకే అందించేందుకు వీలుగా అధునాతన ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల్ని కూడా జారీ చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని రేషన్ డిపోల ద్వారా అందుకునేందుకు విధించిన డెడ్ లెన్ త్వరలోనే ముగియబోతోంది.
ఇప్పటికే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్ని వాటి లబ్దిదారులు చాలా మటుకు తీసుకున్నా.. ఇంకా వందల సంఖ్యలో ఎదురుచూస్తున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్ని స్థానికంగా ఉండే లబ్దిదారులు తీసుకుంటున్నా దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం వచ్చి తీసుకోవడం లేదు. అలాగే ఈ జాబితాలో ఉన్న పలువురు చనిపోవడంతో వారి కార్డులు కూడా రేషన్ దుకాణాల్లోనే ఎదురుచూస్తున్నాయి.

అయితే ఇలా రేషన్ కార్డుల్ని రేషన్ దుకాణాల ద్వారా తీసుకునేందుకు లబ్దిదారులకు ఇచ్చిన గడువు మాత్రం ఈ నెల 15తో ముగియనుంది. మధ్యలో 14వ తేదీ ఆదివారం రావడంతో మూడు రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఈలోపు రేషన్ లబ్దిదారులు తమ స్మార్ట్ కార్డుల్ని రేషన్ దుకాణాల నుంచి వచ్చి తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు. లేకపోతే వాటిని 15వ తేదీ తర్వాత తిరిగి పౌరసరఫరాలశాఖ కమిషనరేట్ కు తిరిగి పంపించేస్తామని చెప్తున్నారు.

అయితే ఇలా 15వ తేదీ తర్వాత కమిషనరేట్ కు తిరిగి పంపే కార్డుల్ని నిర్ణీత సమయం వరకూ సచివాలయాల ద్వారా హోం డెలివరీకి దరఖాస్తు చేసుకుని కూడా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇందుకు 200 రూపాయల కొరియర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరుగా తీసుకుంటే మాత్రం ఉచితంగానే ఇస్తారు. ఇలా హోం డెలివరీకి కూడా ముందుకు రాని వారి కార్డుల్ని మాత్రం రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రేషన్ కార్డులు తీసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే రేషన్ షాపులకు వెళ్లి తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications