వైసిపి హార్డ్ వర్క్... టిడిపి స్మార్ట్ వర్క్... చివరకు ఏది వర్క్అవుట్?...
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేకమైన విచిత్రమైన మలుపులు తిరిగి ఇప్పుడు ప్రి క్లైమాక్స్ దశకు చేరాయి. కేంద్రం ఎపికి అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్ననేపథ్యంలో...ప్రత్యేక హోదా సాధన కోసం అధికార,ప్రతిపక్ష పార్టీలతో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నడుం బిగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రంపై టిడిపి-వైసిపి వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్రక్రియ విషయమై రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశం రాబోయే ఎన్నికలకు అత్యంత కీలకం కాబోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ టిడిపి...ప్రతిపక్ష పార్టీ వైసిపి పనితీరు ఎలా ఉంది?...రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఎలా ఉంది?...ఇప్పుడు చూద్దాం...
ప్రత్యేక హోదాపై...టిడిపి పిల్లి మొగ్గలు...
టిడిపి నేతలు అంగీకరించినా...అంగీకరించకున్నాఎపికి ప్రత్యేక హోదా విషయమై తెలుగుదేశం పార్టీ అనేక పిల్లిమొగ్గలు వేసిన విషయం వాస్తవమంటున్నారు రాజకీయ పరిశీలకులు. తొలుత ఎపికి ప్రత్యేక హోదా వచ్చేస్తోందంటూ చంద్రబాబు, అప్పటి బిజెపి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్మానాలు చేయించుకున్నారని గుర్తుచేశారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసాధ్యం అని కేంద్రం చెప్పడంతో టిడిపి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి టిడిపి వేసిన అతిపెద్ద తప్పటడుగు అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పుడే టిడిపి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉంటే పరిస్థితులు ఇలా వచ్చేవి కాదనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. ఆ తరువాతికాలంలో అసలు ఎవరైనా ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపుతానని హెచ్చరిచ్చేంతవరకు చంద్రబాబు వెళ్లారు. అయితే అదే అభిప్రాయంపై సుదీర్ఘకాలం గడిపేశారు. చివరకు రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం జరిగిన నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు పూర్తి యు టర్న్ తీసుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం ముమ్మరం చేశారు.
ప్రత్యేక హోదా కోసం...వైసిపి ఏం చేసింది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న వైసిపి మొదటినుంచి ప్రత్యేక హోదా కావాలని కోరుతూనే ఉందనేది వాస్తవం. అయితే అందుకోసం మొదట్లో చేసినంత గట్టిపోరాటం అదే పట్టుదలతో...అదే స్థాయిలో చేయలేదనేది వాస్తవమే...ఒకానొక దశలో వైసిపి తానే ఎపికి ప్రత్యేక హోదా అసాధ్యం అని నమ్మినట్లు కనిపించింది. అందుకే తమ పోరాటంలో ఆ అంశానికి ప్రాధాన్యత తగ్గించి ఇతర విషయాలపై దృష్టి కేంద్రీకరించింది. అయితే ఎన్నికలు సమీపిస్తుండటం...కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేయడం...టిడిపి డిఫెన్స్ లో పడిన సందర్భంలో...ఎపి ప్రజల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే...ప్రత్యేక హోదా వస్తే కొంతైనా సాధ్యపడుతుందనే నమ్మకంతో స్పెషల్ స్టేటస్ బలంగా కోరుకోవడం మొదలుపెట్టారు. తదనుగుణంగా వైసిపి మళ్లీ ప్రత్యేక హోదా వాదన గట్టిగా వినిపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఎపికి మొండిచేయి చూపడంతో ఇక ప్రత్యేక హోదా రాష్ట్రానికి అనివార్యమనే అభిప్రాయానికి ప్రజలు రావడం...వైసిపి కూడా తమ పోరాటం ముమ్మరం చేయడం జరిగింది.
ప్రస్తుతం టిడిపి పరిస్థితి...అనివార్యం...
ప్రత్యేక హోదాపై అనేక యూటర్న్ లు తీసుకున్న టిడిపి చివరకు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదా ప్రాధాన్యతను గుర్తించింది. ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందన్న విషయం గుర్తించి ఆ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ కు సై అంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం లోనుంచి...ఎన్టీఏ కూటమిలోనుంచి బైటకు వచ్చేంతవరకు టిడిపి ప్రస్థానం కొనసాగింది. అయితే చివరి నిమిషం వరకు ప్రత్యేక హోదాపై అనేక యు టర్న్ లు తీసుకున్న టిడిపి చివరకు అనివార్యమైన పరిస్థితిలో ఇప్పుడు ప్రత్యేక హోదానే ఆలంబనగా చేసుకొని తమ రాజకీయ ప్రస్థానం ముందుకు కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణాలేమైనప్పటికి లేట్ గా మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన టిడిపి...ఎప్పటినుంచో ఇదే అంశంపై పోరాటం చేస్తున్న వైసిపి కంటే తామే ముందంజలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు...జాతీయ రాజకీయాల్లో అనుభవం వల్ల కావచ్చు...తనకున్న పరిచయాల వల్ల కావచ్చు ఆ దిశలో చురుగ్గానే ముందడుగు వేయగలుగుతున్నారు.
టిడిపిది...స్మార్ట్ వర్క్
అనివార్యమైన పరిస్థితిలో ఎపికి ప్రత్యేక హోదా నినాదం చేత బట్టిన టిడిపి...ప్రస్తుతం తమ స్మార్ట్ వర్క్ తో వైసిపిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో కొంత సఫలమైనట్లు కూడా కనిపిస్తోంది. కారణం టిడిపి మీడియా మేనేజమెంట్ స్కిల్స్ కావచ్చు...గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవం కావచ్చు...తనకున్న పరిచయాలు కావచ్చు...ఇన్నాళ్లు అనేక కారణాల వల్ల ప్రత్యేక హోదా వాదనను బలపరచలేక ఇబ్బంది పడిన చంద్రబాబు...ఎపికి ప్రత్యేక హోదానే తమని రాజకీయంగా గట్టెక్కించగలిగే అంశం కావడంతో ఇక ఈ విషయమై స్థిర నిర్ణయం తీసుకొని ఆ దిశలో తన శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించడం ప్రారంభించారు. అందుకు టిడిపి మార్క్ స్మార్ట్ వర్క్ మొత్తం మొదలు పెట్టేశారు. మీడియాలో టిడిపి చేస్తున్న పోరాటన్ని హైలెట్ చేయడం...ప్రత్యర్థులను బలహీన పర్చడం...వివిధ సంఘాలను కూడగట్టడం...వారిని తమ వాదనకు అనుకూలంగా మలుచుకోవడం...ఇవన్నీ టిడిపి దిగ్వజయంగా చేసుకుంటూ ముందుకుపోతోంది.
వైసిపి హార్డ్ వర్క్...నో స్మార్ట్ వర్క్...
ప్రత్యేక హోదాపై మొదట్నుంచీ పోరాటం చేస్తూనే ఉన్న వైసిపి తమ సత్తా బలంగా చాటాల్సిన కీలక సమయం వచ్చేసరికి టిడిపి వ్యూహాల ముందు నిలవలేక అవస్థలు పడుతోంది. కేవలం హార్ట్ వర్డ్ ను నమ్ముకోవడం తప్పించి వైసిపి స్మార్ట్ వర్క్ విషయంలో టిడిపికి కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. ఎపి రాజకీయాలకు సబంధించి అతి కీలకమైన ఈ దశలో టిడిపి లేట్ గా వచ్చి ఎదురుదాడి చేస్తుంటే...దాన్ని ఎదుర్కొనేందుకు తిప్పలు పడుతోంది. తాజాగా ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకున్న మొదలు టిడిపి ఇటు మీడియా మేనేజ్ మెంట్...వైసిపి, బిజెపిల పై ఎదురుదాడి చేయాల్సిన వ్యక్తుల ఎంపిక..వారి సామాజిక వర్గాలతో సహా వ్యూహాత్మంగా ఆలోచించి ముందుకు దూసుకుపోతుంటే వైసిపి ఎప్పటిలాగానే సమయం సందర్భాల ప్రాధాన్యత లేకుండా రొటీన్ మెథడ్ లలో పోరాటం కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా వచ్చి వైసిపిని జాతీయ స్థాయిలో ఈ మాత్రం బలంగా నైనా కనిపించేలా చేయగలిగాడని చెప్పొచ్చు. ఒకవేళ విజయసాయిరెడ్డి లేకుంటా ఒకవేళ వైసిపి ఇవే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ఆ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉందేది...టిడిపి ని చూసైనా...ఇకముందైనా వైసిపి తమ హార్డ్ వర్క్ కు స్మార్ట్ వర్క్ జోడించే ప్రయత్నం చేస్తుందా?..లేక టిడిపి వ్యూహాలకు చిత్తవుతుందా...అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.